హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను పెంపొందించే లక్ష్యంతో విద్యాశాఖ చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 15,394 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు పొందారు. వీరిలో బడిబాట ప్రారంభించిన తొలిరోజు 5,407 మంది, రెండోరోజైన శనివారం 9,987 మంది ప్రవేశాలు పొందినట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి అడ్మిషన్లు పొందినవారిలో 8,687 మంది అంగన్వాడీ కేంద్రాల నుంచి రావడం విశేషం. అధికారులు కూడా అంగన్వాడీ పిల్లలను సర్కార్ బడుల్లో చేర్పించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్ శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అంగన్వాడీల్లో ఐదేండ్లు నిండిన చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు చొరవ చూపాలని డీఈవోలు, సీపీపీవోలు, మహిళా శిశుసంక్షేమాధికారులను ఆదేశించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి శనివారం మహేశ్వరం నియోజకరవర్గంలోని జల్పల్లిలో పాదయాత్ర నిర్వహించి, ఉపాధ్యాయుల్లో ఉత్సాహం నింపారు.
బడిబాటలో భాగస్వాములవ్వండి!
సర్కారు బడులను బలోపేతం చేసేందుకు చేపట్టిన ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతూ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఎమ్మెల్యేలకు లేఖలు రాశారు. ‘రండి కదిలిరండి.. చేయి చేయి కలుపుదాం.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం’ అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బడిబాట కార్యక్రమం ఈ నెల 3న ప్రారంభమైంది. ఈ నెల 30 వరకు ఈ కార్యక్రమం జరుగనుండగా, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ, వార్డు, బస్తీ వరకు ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, హెచ్ఎంలు, టీచర్లను కలుపుకొని బడిబాటను విజయవంతం చేయాలని లేఖలో మంత్రి పిలుపునిచ్చారు.