ఆర్మూర్, మే 21 : తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు వంటి పథకాలు కేరళ రాష్ట్రంలోనూ అమలుచేయాలని దక్షిణాది రాష్ర్టాల రైతు సంఘాలు తీర్మానించాయి. శనివారం కేరళలోని తిరువనంతపురంలోగల జూబ్లీ యానిమేషన్ సెంటర్లో దక్షిణాది రాష్ర్టాల రైతు సంఘాల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ వ్యవస్థాపకుడు శివకుమార్ కక్కాజితోపాటు తెలంగాణ నుంచి పసుపు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు, రైతుబంధు సమితి ఖమ్మం జిల్లా కన్వీనర్ వెంకటేశ్వర్రావు, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు సాయేందర్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలను కేరళ రాష్ట్రంలో నూ అమలు చేయాలని కోరుతూ సమావేశం తీర్మానించినట్టు కోటపాటి నర్సింహనాయుడు తెలిపారు.
ఈ తీర్మాన ప్రతిని కేరళ సీఎం, ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రికి పంపించినట్టు చెప్పారు. రైతులను సమీకరించి కేరళ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశం నిర్ణయించినట్టు పేర్కొన్నారు. కేరళలోని ఆదివాసీ ప్రాంతాల్లో వన్యమృగాల కారణంగా పంటలను కోల్పోతున్న రైతులను ఆదుకోవాలని కోరినట్టు చెప్పారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అడవి పందులను చంపడం నేరం కాదని తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయాన్ని రైతునాయకులకు కోటపాటి వివరించారు. తెలంగాణలోని రైతు పథకాలను అమలు చేయాలని కేరళతోపాటు ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల సీఎంలను కలిసి విన్నవించినట్టు రైతు సంఘాల నాయకులు తెలిపారు.