హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తున్నది. గడిచిన 24 గంటల్లో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. తెలంగాణలో కొత్తగా 4,207 కేసులు రికార్డవగా.. వైరస్ ఇద్దరు మృతి చెందినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. మహమ్మారి నుంచి 1,825 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26,663 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా 1,20,215 మందికి పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,22,403కు పెరిగింది. ఇందులో ఇప్పటి వరకు 6,91,703 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ కారణంగా 4,067 మంది బాధితులు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 95.75శాతంగా ఉందని, మరణాల రేటు 0.56శాతంగా ఉందని తెలిపింది. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,645 కేసులు, మేడ్చల్ మల్కాజ్గిరిలో 380, రంగారెడ్డిలో 366, హనుమకొండలో 154, సంగారెడ్డిలో 107 కేసులు రికార్డయ్యాయి.