Y Satish Reddy | హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్లో దిక్కు దివానం లేకుండా పోయిన బీఎస్పీ అధినేత్రి మాయావతి.. పార్టీ ఉనికే లేని తెలంగాణకు వచ్చి సీఎం అభ్యర్థిని ప్రకటించడం కన్నా హాస్యాస్పదమైన విషయం మరొకటి లేదు అని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి పేర్కొన్నారు. మాయావతి సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్లోనే ఆమెకు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు. అలాంటిది తెలంగాణకు వచ్చి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ మాట్లాడటం చూస్తే ఆమె మానసిక పరిస్థితిపై అనుమానపడాల్సి వస్తోందన్నారు. అసలు తెలంగాణలో బీఎస్పీ పేరు చెప్పుకొని తిరుగుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత బహుజనులను పూర్తిగా పక్కన పెట్టేసి బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే పనిచేస్తున్నారు.
తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది అని సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ వంటి సంక్షేమం ఇంకెక్కడ లేదని అన్ని రాష్ట్రాలు, అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. అది మాయావతి కళ్ళకు కనపడకపోవడం విడ్డూరం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడంపైనా మాయావతి విమర్శలు చేయడం ఆమె రాజకీయ పరిణితిపై అనుమానాలు రేకెత్తిస్తోంది. సీఎం కేసీఆర్ అంబేద్కర్పై, దళిత బహుజనులపై ప్రేమ ఉంది కాబట్టే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర సచివాలయానికి ఆ మహనీయుని పేరు పెట్టారు. కానీ మాయావతి ఏం చేశారు? ఊరురా మీ పార్టీ గుర్తు అయిన ఏనుగు విగ్రహాలు పెట్టించారు. ఓట్ల కోసం మీరు చేసిన పనిని చూసి జనాలు చీకొట్టి వెళ్లగొట్టారు. ఓట్ల కోసం ఎన్నికల గుర్తుతో రాజకీయం చేసిన మీరు.. సగర్వంగా తెలంగాణ నడిబొడ్డున నిలబడిన ఆ మహానీయుడి విగ్రహ ఏర్పాటును విమర్శించడం అంటే ఆయనను అవమానించడమే అవుతుందన్నారు.
బీజేపీ పాలనలో ప్రజలు అల్లాడిపోతుంటే మీరు కనీసం నోరు తెరవడం లేదు అని సతీష్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలను పట్టించుకోవడం లేదు. ఇదంతా దేనికోసం..? బీజేపీకి మీకు లోపాయికారి ఒప్పందం ఉంది కాబట్టే మీరు నోరు తెరవడం లేదు. ప్రభుత్వ రంగ సంస్థల అన్నింటిని మోడీ సర్కారు ప్రైవేటుపరం చేస్తోంది. అందులో లక్షలాదిగా ఉద్యోగాలు కోల్పోయి యువత రోడ్డున పడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ చేతిలోకి వెళితే రిజర్వేషన్లు ఉండవనే విషయం తెలిసి కూడా దళిత బహుజన బిడ్డల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. దేశాన్ని కుదిపేసిన అదానీ స్కాం పైనా మీరు నోరు తెరవకపోవడాన్ని బట్టి మీరు ఎటువైపు ఉన్నారు? ఎవరి కోసం పని చేస్తున్నారనేది.. దేశంలోని దళిత బహుజనులందరికి అర్థమయిందని ఆయన పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీ బీజేపీ కోసమే పని చేసిందనేది బహిరంగ రహస్యం అని సతీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ వారు అప్పగించిన టాస్క్ పూర్తి చేయడం కోసమే మీరు వచ్చారనేది కూడా ఓపెన్ సీక్రెట్. అందుకే మీరు ప్రజా సమస్యలపై మాట్లాడటం లేదు. ప్రజా కంఠక బీజేపీ పాలనను, ఆ పార్టీ నాయకులను నిలదీయడం లేదు. ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు ఇలాంటి నీచ రాజకీయాలతో మీ గౌరవాన్ని తగ్గించుకోకండి. అసలు దేశంలో మీ విధానం, మీ పార్టీ విధానమేంటో స్పష్టం చేశాకే మీరు ప్రజల్లోకి వస్తే బాగుంటుంది. దళిత బహుజనుల్లో మీకు కాస్తో కూస్తో గౌరవం మిగులుతుంది. అలాకాకుండా వారి పేరుతో బీజేపీ కోసం స్వార్ధ రాజకీయాలు చేద్దామనుకుంటే అదే దళిత బహుజనులు చూస్తూ ఊరుకోరు అని సతీష్ రెడ్డి పేర్కొన్నారు.