హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రజల ఆకాంక్షతో పనిలేదు.. చట్టాన్ని పట్టించుకొనేదిలేదు.. స్వయంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్న ఇంగితం లేదు.. నచ్చితేనే, ఎన్నికల్లో లాభం ఉంటేనే పనిచేయడం.. లేదంటే ప్రజలకు వెన్నుపోటు పొడవటం.. ఇదీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానం. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చే విషయంలో నమ్మించి మోసం చేసిన కేంద్రం.. మహారాష్ట్రకు మాత్రం ఆగమేఘాల మీద మంజూరుచేసి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నించింది. రికార్డుస్థాయిలో రెండున్నరేండ్లలోనే రూ.587 కోట్లు విడుదల చేసి పక్షపాత వైఖరిని రుజువు చేసుకొన్నది. హైదరాబాద్కు చెందిన సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్కు ఆర్టీఐ ద్వారా కేంద్రం ఇటీవల ఇచ్చిన సమాధానాలే ఇందుకు నిదర్శనం. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు తెలంగాణ ప్రజల ఐదారు దశాబ్దాల కల. ఇప్పటివరకు కేంద్రం రెండుసార్లు తెలంగాణ ప్రజలను మోసం చేసింది. ఇందులో బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే.
ధోకా నంబర్-1
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 1980లో హన్మకొండ నుంచి ఎంపీగా ఎన్నికై ఇందిరాగాంధీ క్యాబినెట్లో హోంమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే ఆయన కాజీపేటకు రైల్ కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేయించారు. ఇందిరాగాంధీ చేతుల మీదుగా శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయగా.. ఆమె హత్య, సిక్కుల ఊచకోతతో వాయిదా పడింది. ఆ తర్వాత సిక్కులను శాంతపరిచేందుకు రాజీవ్గాంధీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్లోని కపూర్తలాకు తరలించారు. 1980 తర్వాత యూపీ, బీహార్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ర్టాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసినా తెలంగాణకు మాత్రం ఇవ్వలేదు.
ధోకా నంబర్-2
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం-2014లో తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొన్నది. దీంతో కాజీపేటలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ఎంపీలు తీవ్రంగా ప్రయత్నించారు. కేంద్రం సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం కాజీపేటలో 150 ఎకరాల భూమిని సేకరించి కేంద్రానికి ఇచ్చింది. అయినా బీజేపీ ప్రభుత్వం ఫ్యాక్టరీని మంజూరు చేయలేదు.
నాలుగు నెలల్లోనే అనుమతులు..
కాజీపేట ఫ్యాక్టరీ కోసం తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం దశాబ్దాలుగా పోరాడున్నా పట్టించుకోని కేంద్రం.. మహారాష్ట్రలోని లాతూర్కు మాత్రం కొత్త ఫ్యాక్టరీని మంజూరు చేసి చకచకా నిర్మాణం పూర్తి చేస్తున్నది. 2018 ఏప్రిల్లో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రతిపాదనలు రాగా, ఆగస్టులో రూ.625 కోట్లతో రైల్వే బోర్డు అనుమతులిచ్చింది. సాధారణంగా రైల్వే ప్రాజెక్టులు నత్తకు నడకలు నేర్పినట్టు సాగుతుంటాయి. కానీ ఈ ఫ్యాక్టరీకి మాత్రం కరోనా సమయంలోనూ నిధుల వరద పారింది. మూడేండ్లలోనే రూ.587 కోట్ల పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరినాటికి మొత్తం పూర్తి చేస్తామని బోర్డు చెప్తున్నది. తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతున్నా రాష్ట్రంలోని బీజేపీ నేతలు మాత్రం నేలచూపులే చూస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా పోరాడిందేమీ లేదు.