బంజారాహిల్స్/నాంపల్లి కోర్టులు, ఏప్రిల్ 24: విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మ దౌర్జన్యానికి దిగారు. ఆందోళన వద్దని సూచించిన పోలీస్ సిబ్బందిపై దాడులకు పాల్పడ్డారు. షర్మిల ఎస్సై కాలర్ పట్టుకొని పక్కకు ఈడ్చారు. మహిళా కానిస్టేబుల్ను చెంపదెబ్బ కొట్టారు. షర్మిలను జూబ్లీహిల్స్ ఠాణాకు తరలించగా, అక్కడికి వచ్చిన తల్లి విజయమ్మ కూడా పోలీసులపై చేయి చేసుకున్నారు. వైఎస్ షర్మిలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఆమెకు న్యాయమూర్తి మే 8 వరకు రిమాండ్ విధించారు. టీఎస్పీఎస్సీ పేపర్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వైఎస్ షర్మిల సోమవారం యత్నించారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్ తన సిబ్బందితో షర్మిల ఇంటికి వెళ్లారు. ముట్టడికి ముందస్తు అనుమతులు లేవని, ట్రాఫిక్ సమస్యతోపాటు శాంతిభద్రలకు విఘాతం కలుగుతుందని, తమకు సహకరించాలని, బయటకు రావద్దని కోరారు. పోలీసుల వినతిని లెక్కచేయకుండా షర్మిల ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డుపై బైఠాయించారు. తాను ఇష్టమొచ్చిన చోటకువెళ్తానని, ఎందుకు అడ్డుకుంటారని పోలీసులపై ఫైరయ్యారు.
‘మీకు పనేమీ లేకుంటే గాడిదలు కాసుకోండి’ అంటూ పోలీసులను దూషించారు. కారులో వెళ్లేందుకు ప్రయత్నిస్తుండటంతో ఎస్సై రవీందర్ ఆమెను ఆగాలని కోరారు. ‘నన్నే ఆగమంటావా?’ అంటూ ఎస్సై కాలర్ పట్టుకొని పక్కకు ఈడ్చారు. ఆమెను అడ్డుకోబోయిన మహిళా కానిస్టేబుల్ను చెంపదెబ్బ కొట్టారు. అనంతరం కారు ఎక్కిన షర్మిల.. కారు డ్రైవర్ బాబుకు ముందు పోనివ్వు ఏదైతే అది అవుతుందంటూ.. పోలీసులపైకి ఉసిగొల్పారు. డ్రైవర్ కారును ముందుకు పోనివ్వడంతో కానిస్టేబుల్ గిరిబాబు కాలుపైకి టైరు ఎక్కడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను వెంటనే పోలీసులు దవాఖానకు తరలించారు. షర్మిల దౌర్జన్యం శృతిమించడంతో అక్కడున్న మహిళా పోలీసులు ఆమెను జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఎస్సై రవీందర్ ఫిర్యాదు మేరకు షర్మిలతోపాటు ఆమె డ్రైవర్లు బాబు, జాకబ్లపై ఐపీసీ 332, 353, 509,427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. షర్మిలతోపాటు ఆమె డ్రైవర్ బాబును అరెస్టు చేశారు. గాంధీ దవాఖానలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి షర్మిలకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. షర్మిల తరఫున లాయర్లు బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.
కూతురును పరామర్శించేందుకు వచ్చి…
షర్మిలను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు తరలించారు. అక్కడకు వచ్చిన వైఎస్సార్టీపీ కార్యకర్తలను పోలీసులు పంపించివేశారు. కాసేపటికి అక్కడకు వైఎస్ విజయమ్మ వచ్చారు. షర్మిలపై కేసు నమోదయ్యిందని, పోలీస్ కస్టడీలో ఉన్నారని పోలీసులు ఆమెకు వివరించారు. పోలీసుల దౌర్జన్యమంటూ అక్కడున్న పోలీసులపై ఆమె దౌర్జన్యానికి దిగారు. నడిరోడ్డుపై కారును ఆపిన ఆమె స్టేషన్లో ఉన్న తన కూతురును కలువాలని పట్టుబట్టారు. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి.. రోడ్డు పక్కకు రావాలని పోలీసులు ఆమెను కోరారు. షర్మిల పోలీస్ కస్టడీలో ఉన్నారని, ఆమె నుంచి వివరాలు సేకరిస్తున్నామని, ఇప్పుడు ఆమెను కలిసేందుకు అవకాశం లేదని మహిళా పోలీసులు ఆమెకు అన్నివిధాలా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నాకే మాటలు చెప్తరా? అంటూ కోపంతో ఊగిపోతూ అక్కడున్న మహిళా కానిస్టేబుళ్లపై విజయమ్మ చేయి చేసుకున్నారు. ఆమెకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు.
పోలీసు అధికారుల సంఘం ఖండన
పోలీసులపై తల్లీబిడ్డలు దాడిచేయడాన్ని హైదరాబాద్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నల్లా శంకర్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలు పోలీసుల ఆత్మాభిమానాన్ని తీస్తున్నాయని, పోలీసుల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. పోలీసులపై దాడి చేసిన వారు తమ చర్యలపై ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. ఇటీవల కొందరు రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత గుర్తింపు కోసం ఇలాంటి చౌకబారు చర్యలకు పాల్పడుతూ, పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.