Telangana | హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో రాష్ట్రంలో భారీగా నగదు, బంగారం, మద్యం, ఇతర విలువైన వస్తువులు పట్టుబడుతున్నాయి. ఈ నెల 9 నుంచి 17 వరకు అక్రమంగా తరలిస్తున్న రూ.101.18 కోట్లకుపైగా విలువైన నగదు, మద్యం, బంగారం, ఆభరణాలు, ఇతర వస్తువులను పోలీసులు, ఎన్నికల టాస్క్ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర ఎక్స్పెండిచర్ నోడల్ ఆఫీసర్ మహేశ్భగవత్, నోడల్ ఆఫీసర్ సంజయ్కుమార్ జైన్ మంగళవారం ప్రకటించారు.
డీజీపీ అంజనీకుమార్ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 373 ఫ్లయింగ్ స్కాడ్లు, 374 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్లు, 95 సరిహద్దు చెక్పోస్టుల ద్వారా విస్తృత తనిఖీలు చేపట్టి ఈ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. అందులో రూ.55,99,26,994 నగదు, రూ. 2,60,57,004 విలువైన మద్యం, రూ.3,42,84,275 విలువైన మాదకద్రవ్యాలతోపాటు రూ.38,45,44,526 విలువైన బంగారం, ఇతర ఆభరణాలు ఉన్నట్టు వివరించారు. 2018లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు మొత్తం రూ.103 కోట్లు పట్టుబడ్డాయని, ఈసారి దాదాపు అంతే మొత్తం సొత్తును కేవలం 9 రోజుల్లోనే స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆయుధ యజమానులు 5,529 లైసెన్స్డ్ గన్స్ను డిపాజిట్ చేసినట్టు చెప్పారు. లైసెన్స్ లేని మరో 3 ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు ఇప్పటివరకు 17,128 మందిపై 5,252 బైండోవర్ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.