హైదరాబాద్, ఏప్రిల్ 12 (సమస్తే తెలంగాణ): ట్రాన్స్జెండర్ల హక్కులను కాపాడడంతోపాటు సమాజంలో వారిపట్ల ఉన్న వివక్షను పోగొట్టేందుకు ‘ప్రైడ్ ప్లేస్’ సెల్ ఉపయోగపడుతుందని డీజీపీ ఎం మహేందర్రెడ్డి అన్నారు. ట్రాన్స్జెండర్ల సాధకబాధకాలు గుర్తించేలా సమాజంలోని అందరు వ్యక్తుల్లోనూ అవగాహన పెంచితేనే 90 శాతం సమస్యలు సమసిపోతాయని అన్నారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పో లీసులు రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణకు ప్రైడ్ సెల్ పేరిట ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేశారు. లక్డీకాపూల్లోని మహిళాభద్రత విభాగం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సెల్ను డీజీపీ మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, సమాజంలో మార్పులకు అనుగుణంగా భారత న్యాయవ్యవస్థ అనేక సందర్భాల్లో ఎన్నో జడ్జిమెంట్లు ట్రాన్స్జెండర్ సొసైటీ గురించి ఇచ్చిందని అన్నారు. 2019లో ట్రాన్స్జెండర్ల చట్టం వచ్చిందని డీజీపీ గుర్తు చేశారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడు గౌరవంగా బతికే అవకాశాన్ని కల్పిస్తున్నదని, వ్యక్తి గౌరవానికి భంగం కలుగకుండా చూడాల్సిన బాధ్యత సమాజంపై ఉన్నదని అన్నారు. ప్రైడ్ప్లేస్ ఏర్పాటు చేసినందుకు అధికారులను అభినందించారు. అడిషనల్ డీజీ స్వాతిలక్రా మాట్లాడుతూ, సమాజంలోని ప్రతి ఒక్కరి మాదిరిగానే ట్రాన్స్జెండర్లు సైతం గౌరవంగా బతకాలనుకుంటారని చెప్పారు. వారు కుటుంబాల్లో, విద్యాలయా ల్లో ఇలా సమాజంలో ఎదుర్కొంటున్న వివక్ష పరిష్కారానికి ప్రైడ్ప్లేస్ వేదిక కావాలన్నదే తమ లక్ష్యం అన్నారు. ప్రైడ్ప్లేస్ పనితీరును డీఐజీ సుమతి వివరించారు. ట్రాన్స్జెండర్ల రిసెర్చ్ సెంటర్కు చెందిన తాశి మాట్లాడుతూ, ట్రాన్స్జెండర్ల గురించి చట్టాలు చేస్తే సరిపోదని వాటి అమలుపై చర్యలు ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో తరుణి ఎన్జీవో ప్రతినిధి డాక్టర్ మమత రఘువీర్, మహిళా భద్రత విభాగం అధికారులు, ట్రాన్స్జెండర్లు, ఇతరులు పాల్గొన్నారు.