హైదరాబాద్ : నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఆ ఐదుగురు తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర హోంశాఖ అందజేసే ‘కేంద్ర హోం మంత్రి మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్-2022’ పతకాలకు తెలంగాణ పోలీసు శాఖ నుంచి ఆ ఐదుగురు పోలీస్ అధికారులు ఎంపికయ్యారు. నేర పరిశోధనలో అత్యత్తుమ ప్రతిభ కనబర్చినందుకు గాను వీరిని ఎంపిక చేసినట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది.
ఈ పతకాలకు ఎంపికైన వారిలో ప్రస్తుతం ట్రాన్స్కో డీఎస్పీగా పనిచేస్తున్న పి వెంకట రమణ, ఆసిఫ్నగర్ ఏసీపీ రుద్రవరం గాండ్ల శివ మారుతి, ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ బి అంజిరెడ్డి, బాలానగర్ డీఎస్పీ ఏ గంగారామ్, జహీరాబాద్ ఏసీపీ వి రఘు ఉన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో కలిపి కేంద్ర హోంశాఖ 151 మంది పోలీస్ అధికారులను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. కేసుల దర్యాప్తులో ఉత్తమంగా పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది ప్రోత్సహించేందుకు కేంద్ర హోంశాఖ 2018 నుంచి ఈ మెడల్స్ను అందజేస్తోంది.