హైదరాబాద్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
మినిస్టర్ క్వార్టర్స్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర కంప్యూటర్ ఆపరేటర్ కం అకౌంట్ అసిస్టెంట్స్, ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ 2022 సంవత్సరపు క్యాలెండర్, డైరీని బుధవారం మంత్రి ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13 కోట్ల 75 లక్షల పనిదినాలు కేటాయిస్తే, ఇప్పటివరకు 13 కోట్ల 40 లక్షల పనిదినాలు (97.97 శాతం) కల్పించామని మంత్రి తెలిపారు. దీనికి తోడుగా మరో 2 కోట్ల పని దినాలకు ఈ సంవత్సరం లో అనుమతి లభించిందని ఆయన చెప్పారు.
ఉపాధి హామీ పథకం క్రింద రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 3 వేల 498 కోట్ల రూపాయల 40 లక్షల రూపాయలు వ్యయం చేశామని మంత్రి తెలిపారు. అందులో భాగంగా ఈ పథకం కింద కూలీలకు 2 వేల 381 కోట్ల రూపాయలు కూలీగా చెల్లించినట్లు ఆయన వివరించారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం వల్ల ఎన్నో సత్ఫలితాలు సాధిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
దేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో 98 వేల కోట్ల రూపాయలు కేటాయించగా, 2022-23 ఆర్ధిక సంవత్సరం లో 73 వేల కోట్ల రూపాయలకు కుదించడం శోచనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర కంప్యూటర్ ఆకౌంట్స్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ రఫీ సయ్యద్, ప్రధాన కార్యదర్శి విజయ్, జాయింట్ సెక్రెటరీలు రఘు, సుధీర్ రెడ్డి, వెంకటేష్, రాష్ట్ర ఇంజినీరింగ్ కన్సల్టెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లింగయ్య, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, రాష్ట్ర టెక్నికల్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ సంజీవ్, ప్రధాన కార్యదర్శి వెంకట్రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.