యాదాద్రి, సెప్టెంబర్ 13 : యాదగిరిగుట్ట స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలను శాస్ర్తోక్తంగా జరిపారు. మంగళవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు తిరువారాధన, నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన జరిపారు. సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవోత్సవం, లక్ష్మీనరసింహుల నిత్యకల్యాణోత్సవం, మొక్కు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించారు. సాయంత్రం వేళ ప్రాకారంలో వెండి మొక్కు జోడు సేవోత్సవం, దర్బార్ సేవలను సంప్రదాయంగా జరిపించారు. స్వామివారి నిత్య ఆదాయం రూ.10,25,401 వచ్చినట్టు ఆలయ ఈవో గీత తెలిపారు. స్వామివారి 14 రోజుల హుండీని మంగళవారం లెక్కించగా రూ.90,33,396 ఆదాయం వచ్చినట్టు ఆలయ ఈవో గీత చెప్పారు.