హైదరాబాద్, నమస్తే తెలంగాణ : పెద్దల సభగా చెప్పుకొనే శాసనమండలి ఇంద్రధనస్సులా ప్రకాశించబోతున్నది. అనేక రంగాల్లో విశేష అనుభవం ఉన్న ప్రముఖులు ఈసారి సభలో ఆసీనులవుతున్నారు. 40 సీట్లున్న శాసన మండలిలో నెల వ్యవధిలోనే దాదాపు 50% సీట్లు భర్తీ అయ్యాయి. ఇటీవలి ఎన్నికల్లో 18 మంది, గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఒకరు ఎన్నికయ్యారు. వీరంతా వివిధ రంగాల్లోని ప్రముఖులే..
కడియం శ్రీహరి- మాజీ ఉప ముఖ్యమంత్రి
శ్రీహరికి రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్నది.1994 నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో కలిపి దాదాపు 13 ఏండ్లకుపైగా మంత్రిగా పనిచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా
పనిచేశారు.
గుత్తా సుఖేందర్రెడ్డి- శాసనసమండలి మాజీ చైర్మన్
గ్రామస్థాయి నుంచి లోక్సభ వరకు ఎన్నికైన కొద్దిమంది నాయకుల్లో గుత్తా సుఖేందర్రెడ్డి ఒకరు. మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తొలిసారే ఆయన శాసనమండలి చైర్మన్గా పనిచేశారు.
సిరికొండ మధుసూదనాచారి- తెలంగాణ అసెంబ్లీ తొలి స్పీకర్
సిరికొండ మధుసూదనాచారి 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించినప్పటి నుంచి ఆయన వెంటే ఉన్నారు. రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్గా పనిచేశారు. తాజాగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు.
పీ వెంకట్రామిరెడ్డి- మాజీ ఐఏఎస్
తెలంగాణ శాసనమండలికి తొలిసారి ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఎన్నికయ్యారు. జిల్లా కలెక్టర్గా కూడా పనిచేసిన పీ వెంకట్రామిరెడ్డి ఈ రికార్డును సొంతం చేసుకొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మాజీ ఐఏఎస్ అధికారి మండలికి ఎన్నికైన చరిత్ర లేదు.
ఎల్ రమణ- సుదీర్ఘ రాజకీయ అనుభవం
1994లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రమణ ఎంపీగా, మంత్రిగా పనిచేశారు. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగారు.
వాణీదేవి- మాజీ ప్రధాని కుమార్తె
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు వాణీదేవి కూడా పెద్దల సభలో అడుగుపెట్టారు. విద్యావేత్తగా, విద్యాసంస్థల అధినేతగా ఆమెకు మంచి గుర్తింపు ఉన్నది.
కల్వకుంట్ల కవిత- మాజీ ఎంపీ
తెలంగాణ జాగృతి సంస్థతో స్వరాష్ట్ర ఉద్యమంలో సాంస్కృతిక చైతన్యం తెచ్చిన ప్రముఖ నాయకురాలు కవిత. గతంలో ఎంపీగా గెలుపొందిన ఆమె, మండలికి ఎన్నికవటం ఇది రెండోసారి.
పాడి కౌశిక్రెడ్డి- రంజీ క్రికెటర్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కౌశిక్రెడ్డి రంజీ క్రికెటర్గా రాణించారు. చిన్న వయసులోనే మండలికి ఎన్నికయ్యారు.
గోరటి వెంకన్న- కవి, గాయకుడు
ప్రజా వాగ్గేయకారుడిగా గోరటి వెంకన్నను ఎరుగనివారు ఉండరు. తెలంగాణ ఉద్యమంలో ఆయ న పాత్ర కీలకమైనది. వెంకన్నను సీఎం కేసీఆర్ మండలికి పంపించారు. విద్యావేత్తలైన పల్లా రాజేశ్వర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, బండా ప్రకాశ్ మండలిలో కొలువుదీరారు.