హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న 2018 బ్యాచ్కు చెందిన సీనియర్ రెసిడెంట్లను రిలీవ్ చేయాలని వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) రమేశ్రెడ్డి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం పీజీ పూర్తయిన వైద్య విద్యార్థులు ఏడాదిపాటు సీనియర్ రెసిడెంట్లుగా పనిచేయాల్సి ఉంటుంది. 2021 నవంబర్లో విధుల్లో చేరినవారు ఇప్పటికే ఏడాది కాలం పూర్తి చేశారు. వీరిని ఈ నెల 31న రిలీవ్ చేయాలని డీఎంఈ ఆదేశించారు. వీరి స్థానంలో ఇటీవల పీజీ పూర్తి చేసిన 2019 బ్యాచ్ విద్యార్థులను నియమించనున్నారు. సీనియర్ రెసిడెంట్ల నియామకాల కోసం ఈ నెల 23, 24 తేదీల్లో కోఠిలోని డీఎంఈ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. మెరిట్ ప్రాతిపదికన కేటాయింపులు చేపడతారు. ఈసారి మారుమూల ప్రాంతాల్లోని దవాఖానల్లో వైద్యుల కొరతను తీర్చేందుకు వీరి సేవలను వినియోగించుకొనే అవకాశం ఉన్నదని వైద్యవర్గాలు తెలిపాయి. పీజీ పూర్తి చేసిన వైద్య విద్యార్థులు రెసిడెంట్లుగా పనిచేయకపోతే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటారు. రూ.20 లక్షల జరిమానాతోపాటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో పర్మనెంట్ రిజిస్ట్రేషన్కు ఇబ్బందులు ఎదురవుతాయి.