బాల్యంలోనే వితంతువైన మాతంగిని స్వాతంత్య్రోద్యమం నిప్పురవ్వలా మార్చింది. తుపాకీ తూటాలకు ఎదురేగి నేతలకే స్ఫూర్తిగా నిలిచింది. నెత్తురోడుతూనే ‘వందేమాతరం’ అంటూ మువ్వన్నెల జెండా ఎగరేస్తూ ప్రాణాలొడ్డిన మాతంగిని క్విట్ ఇండియా ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచింది. ‘గాంధీ బుడ్డీ’గా ప్రశంసలు అందుకున్నది.
మాతంగిని హజ్రా బెంగాల్ ప్రెసిడెన్సీలోని తమ్లుక్ పట్ణణంలో పుట్టింది. పేదరికం వల్ల అరవై ఏండ్ల త్రిలోచన్ హజ్రా అనే వృద్ధుడితో ఆమెకు పెళ్లిచేశారు. 18 ఏండ్లకే భర్తను కోల్పోయి, పుట్టింటికి చేరింది. 35 ఏళ్ల వయసులో గాంధీ ప్రభావంతో ఖాదీ వడుకుతూ స్వదేశీ నినాదాన్ని అందుకుంది. కొన్నేండ్ల తర్వాత తనుకూడా శాసనోల్లంఘనకు పాల్పడాలనుకుంది. అలినాన్లో ఉప్పు తయారు చేసి బ్రిటిష్ చట్టాలను ఉల్లంఘించింది. పోలీసులు జైలుకి పంపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత స్థానిక పోలీసులు వసూలు చేసే చౌకీదారీ పన్ను వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నది. 1933లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ స్థానిక మహాసభలకు హాజరైంది. చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసినప్పుడు ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానిక కోర్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు నిరసన ర్యాలీ నడిపి, భవనంపై నల్లజెండా ఎగురవేసింది. ఆమెను మళ్లీ అరెస్ట్ చేసి ఆరు నెలల శిక్ష విధించారు. ఆ శిక్షానంతరం రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమంలో పాల్గొన్నది.
1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమం రాజుకున్నది. గాంధీజీ పిలుపు మేరకు 71 ఏండ్ల వయస్సులోనూ మాతంగిని 6 వేల మంది నిరసనకారులకు నాయకత్వం వహిస్తూ ఉద్యమాన్ని ముందుండి నడిపింది. మహిళలతో కలిసి తమ్లుక్ పోలీస్ స్టేషన్ని స్వాధీనం చేసకున్నది. బ్రిటిష్ పోలీసు బలగాలు పెద్దసంఖ్యలో అక్కడికి తరలివచ్చాయి. 144వ సెక్షన్ ఉందని.. అందరూ వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. పోలీసులను వారించేందుకు మాతంగిని ముందడుగేసింది. కానీ ఆమె నోటినుంచి మాటరాకముందే పోలీస్ అధికారి కాల్పులకు దిగాడు. ఆమె భుజంలోకి తుపాకీ తూటా దూసుకుపోయింది. ఆ వెంటనే మరో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. రెండో బుల్లెట్ మరో భుజంలోకి దూసుకుపోయింది. మూడో బుల్లెట్ ఆమె నుదుటిని తాకింది. అయినా ఆమె ప్రాణభయంతో ఆగిపోలేదు. వేలాది మంది నిరసనకారులు చూస్తుండగానే ముందడుగు వేసింది. తుపాకీ గాయాలతో నెత్తురోడుతూనే చేతుల్లోని స్వరాజ్ జెండాని సమున్నతంగా ఎత్తిపట్టింది. పంటి బిగువున నిలుచుని ‘వందేమాతరం’ అంటూ మువ్వన్నెల జెండాను ఎగరేసింది. ఆమె పోరాటపటిమ, త్యాగం బెంగాల్ స్వాతంత్య్ర పోరాటానికి ఊపిరులూదింది.
తమ్లూక్ పట్టణంలో పోలీస్ కాల్పుల్లో మాతంగిని హజ్రా ప్రాణత్యాగం చేసిన చోటే ఒక విగ్రహాన్ని నెలకొల్పారు. స్వాతంత్య్రానంతరం కోల్కతా నగరంలోనూ ఆమె విగ్రహాన్ని నెలకొల్పారు. క్విట్ ఇండియా ఉద్యమానికి అరవై ఏండ్లు పూర్తయిన సందర్భంలో మాతంగిని స్మారకంగా తపాల శాఖ ఒక పోస్టల్ స్టాంప్ను విడుదల చేసింది.