హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): సర్కారు స్కూళ్లను సమగ్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. ఇందుకు 2022-23 విద్యాసంవత్సరాన్ని ఎంచుకున్న సర్కారు.. త్రిముఖ వ్యూహాన్ని అమలుచేస్తున్నది. మొదటిది మన ఊరు -మన బడి కాగా, రెండోది ఆంగ్లమాధ్యమం, మూడో అస్త్రంగా తొలిమెట్టు కార్యక్రమాన్ని చేపట్టింది. మన ఊరు-మనబడి, ఇంగ్లిష్ మీడియం చదువుల ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. త్వరలో ప్రారంభమయ్యే తొలిమెట్టుతోనూ గణనీయమైన ఫలితాలు రానున్నాయి. ఈ మూడింటి అమలుతో సర్కారు స్కూళ్లు సరికొత్త శోభను సంతరించుకుంటాయని విద్యావేత్తలు భావిస్తున్నారు. బడులకు కొత్త సొబగులు అద్దేందుకు ప్రభు త్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని రూ.7289. 54 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టింది. తొలి విడతలో 9123 స్కూళ్లను ఎంపికచేసింది. రూ.3497 కోట్ల అంచనాలు సిద్ధం చేశారు. 12 రకాల అంశాల్లో బడుల రూపురేఖలు మారుస్తున్నారు. ఇప్పటికే పలు పాఠశాలల్లో పనులు ఊపందుకున్నాయి. మరికొన్ని టెండర్ల దశలో ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరంలో 1-8 తరగతులు, వచ్చే ఏడాది 9వ తరగతి, మరుసటి ఏడాది 10వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియాన్ని క్రమంగా విస్తరిస్తారు. ఇంగ్లిష్ మీడియంలో బోధనకు రాష్ట్రంలో 82 వేల టీచర్లకు విద్యాశాఖ శిక్షణనిచ్చింది. విద్యార్థులు చదువుకొనేందుకు వీలుగా కుడి వైపు తెలుగు, ఎడమ వైపు ఇంగ్లిష్తో కూడిన ద్విభాషా పుస్తకాలను పంపిణీ చేస్తున్నది.
ఆగస్టు 15 నుంచి తొలిమెట్టు
సగటున ఒక విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.50,238 ఖర్చుచేస్తున్నది. వేల కోట్లు ఖర్చుచేస్తున్నా.. అందుకు తగిన ఫలితాలు రాకపోతే ప్రభుత్వ ప్రయత్నమంతా వృథా అయినట్లే. దీనికి పరిష్కారంగా రాష్ట్రంలో విద్యప్రమాణాల పెంపు, గుణాత్మమైన మార్పు కోసం ఈ ఏడాది నుంచి ‘తొలిమెటు’్ట కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. విద్యార్థులు కనీస సామర్థ్యాలను సాధించేలా చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్ధేశం. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని 23,179 ప్రాథమిక బడుల్లో ఈ కార్య్రమం ప్రారంభంకానున్నది. దీని ద్వారా 11,24,563 విద్యార్థులు లబ్ధి పొందుతారు. ఒక్కో విద్యార్థి వారిగా ప్రగతిని టీచర్లు పరీక్షించి, వారి స్థాయిలను బట్టి ప్రత్యేకంగా బోధించి, నిర్దిష్ట కనీస సామర్థ్యాలను సాధించేలా ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తారు.