హైదరాబాద్, మార్చి 15 : విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల (వీఆర్ఏ)లను నీటిపారుదల శాఖలోకి తీసుకొనే అంశాన్ని పరిశీలిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఐచ్ఛికం ద్వారా వీఆర్ఏలను నీటిపారుదలశాఖలోకి తీసుకొని, వాళ్లకు స్కేల్ ఇస్తే బ్రహ్మాండంగా పని జరుగుతుందనే ఆలోచన ఉన్నదని, త్వరలోనే ప్రాసెస్ జరుగుతుందన్నారు. మంగళవారం సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
నష్టపోయిన రైతులను ఆదుకొంటం
వరంగల్, ఖమ్మం జిల్లాలో కొన్ని చోట్ల అనుకోని విధంగా కురిసిన వడగండ్ల వానతో మిర్చి, ఇతర పంటల రైతులు నష్టపోయారు. మంథని ప్రాంతంలోనూ నష్టం జరిగింది. పంట నష్టంపై త్వరగా రిపోర్ట్ ఇవ్వాలని వ్యవసాయశాఖ మంత్రి ని కోరుతున్నాను. ఇంత పెద్ద బడ్జెట్లో పంట నష్ట పరిహారం ఇవ్వడం పెద్ద కష్టం కాదు. తప్పకుండా రైతులను కడుపునిండా ఆదుకొంటాం.
ఎస్సీ ఉద్యోగులకు వేగంగా పదోన్నతులు
ఎస్సీ ఉద్యోగుల పదోన్నతులు ఆపడానికి వీల్లేదు. ఎస్సీ ఉద్యోగుల పదోన్నతుల్లో జాప్యం చేయొద్దని మరోసారి అధికారులకు గట్టిగా ఆదేశిస్తున్నా. ఏ శాఖలో ఈ సమస్య ఉన్నదో ఆ మంత్రులు సమీక్షించి పరిష్కరిస్తారు.
ధరణి సమస్యలకు త్వరలోనే పరిష్కారం..
ధరణి పోర్టల్ విప్లవాత్మక అడుగు. ఇప్పటివరకు 1.55 కోట్ల ఎకరాల భూమి ధరణి పోర్టల్లో చేరింది. చాలా తక్కువ విస్తీర్ణంలో భూమి ధరణిలో చేరకుండా మిగిలింది. పార్ట్-బీలో ఉన్న భూములను సమీక్షిస్తూ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. ఇటీవలే సీఎస్తో ధరణిపై సమీక్షించి చిన్నచిన్న చిక్కులు తొలగించేందుకు ఏడెనిమిది స్టెప్స్ తీసుకున్నాం. ధరణిలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తాం. భూదాన్ భూములపై ఏమైనా సమస్య ఉన్నా పరిష్కరిస్తాం.
వీలైనంత త్వరగా ఉస్మానియా నిర్మాణం
వారసత్వ సంపదకు ఇబ్బంది లేకుండా హైదరాబాద్లోని ఉస్మానియా దవాఖానను వీలైనంత త్వరగా పునర్నిర్మాణ పనులు చేపట్టాలని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావును కోరుతున్నా. త్వరలోనే దవాఖాన నిర్మాణం పూర్తవుతుంది. పాత బస్తీలో రోడ్ల విస్తరణకు ఇప్పటికే రూ. 500 కోట్లు ఖర్చు చేశాం. మరో రూ.200 కోట్లు ఇచ్చేందుకు వెనక్కి వెళ్లం. దీనిపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్తోనూ మాట్లాడాను. ఫైనాన్స్ కార్పొరేషన్ దరఖాస్తులను పరిష్కరించాలని హోంమంత్రి మహమూద్ అలీని కోరుతున్నా అని సీఎం కేసీఆర్ తెలిపారు.
నీటి పారుదలకు లష్కర్లు
రాష్ట్రంలో చాలా పరిపాలనా సంస్కరణలు తెచ్చుకొని కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు ఏర్పాటు చేసుకొన్నాం. వీటిలో పూర్తిస్థాయి నిర్వహణకు కొత్త ఉద్యోగాల భర్తీ చర్చలో భాగంగా వీఆర్వోల పంపిణీ కూడా జరుగుతున్నది. వీఆర్ఏలో కొంత మంది విద్యాధికులు ఉన్నారు. వీళ్లు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నరు. మిగతావాళ్లు కూడా ఏదైనా దారి చూపించాలని అడిగారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గతంతో పోల్చితే భిన్నంగా ఉన్నది. గత తెలంగాణకు, ప్రస్తుత తెలంగాణ రాష్ర్టానికి చాలా తేడా ఉన్నది. సుమారు రూ.లక్ష కోట్లు ఖర్చుచేసి ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించుకొన్నాం. ఇంకా రూ.20-30 వేల కోట్లు ఖర్చు చేస్తే పాలమూరు, సీతారామ తదితర ప్రాజెక్టులు కూడా పూర్తవుతాయి. కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు కూడా ఉన్నాయి. వీటన్నింటి నిర్వహణ సమర్థంగా జరగాలంటే ‘లష్కర్’ అనే పోస్టు ఉంటుంది. దీన్ని భర్తీ చేయాల్సి ఉన్నది. వీఆర్ఏలను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోకి తీసుకొని పేస్కేల్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. ఇందుకు ఎవరూ అభ్యంతరం చెప్పరనే అనుకొంటున్న. వారికి తప్పకుండా న్యాయం జరుగుతుంది.