కోదాడ రూరల్, నవంబర్ 22 : బీజేపీ దళిత వ్యతిరేక పార్టీగా మారిందని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేపడుతామని హామీ ఇచ్చి మాదిగలను మోసం చేసిందని మండిపడ్డారు.
మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం చిమిర్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ చేపట్టకుండా ఎస్సీల మధ్య చిచ్చుపెడుతున్న కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ వచ్చే నెలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టనున్నట్టు చెప్పారు. ప్రజల మధ్య మతం పేరుతో చిచ్చుపెడుతూ దేశంలో శాంతియుత వాతావరణాన్ని చెడగొడుతున్న బీజేపీకి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అందు కు ప్రజలు సన్నద్ధం కావాలని కోరారు.