హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ పోలవరం బ్యాక్వాటర్ ఎఫెక్ట్పై అధ్యయనం చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రాజెక్టు ప్రభావిత రాష్ర్టాలైన తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలతో ఈ నెల 29న సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఆయా రాష్ర్టాలకు కేంద్ర జలవనరుల శాఖ లేఖలు రాసింది. వాస్తవానికి సీడబ్ల్యూసీ కార్యదర్శి పంకజ్కుమార్ ఆధ్వర్యంలో ఈ సమావేశం గత బుధవారం కొనసాగాల్సి ఉంది. అయితే ముంపుపై అధ్యయనానికి సంబంధించి చర్చించాల్సిన అంశాలపై సిద్ధమయ్యేందుకు తమకు తగినంత సమయం ఇవ్వలేదని, హడావుడిగా సమావేశం ఏర్పాటు చేయడమేంటని ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేయగా, ఆ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర జలవనరుల శాఖ ఆ సమావేశాన్ని 29న నిర్వహించాలని నిర్ణయించింది.