హైదరాబాద్ : ప్రతిష్టాత్మక లండన్ కింగ్స్ కాలేజ్తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ ఫార్మా సిటీలో ఏర్పాటుచేయబోయే ఫార్మా యూనివర్సిటీకి సంబంధించిన పరిశోధన, అకాడమిక్ వ్యవహారాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కింగ్స్ కాలేజ్ కలిసి పనిచేయనుంది. యూకే పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ సమక్షంలో గురువారం లండన్లో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, కింగ్స్ కాలేజ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (హెల్త్, లైఫ్ సైన్సెస్), కింగ్స్ హెల్త్ పార్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రిచర్డ్ ట్రెంబాత్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.
గత నెలలో బ్రిటిష్ కౌన్సిల్ నేతృత్వంలో కింగ్స్ కాలేజ్ లండన్ ప్రెసిడెంట్, ప్రిన్సిపాల్ సహా కింగ్స్ ప్రతినిధులు భారతదేశంలో పర్యటించారు. దానికి కొనసాగింపుగా గురువారం లండన్లోని కింగ్స్ కాలేజ్ క్యాంపస్ను మంత్రి కేటీఆర్ సందర్శించారు. తాజా ఒప్పందంతో ఫార్మా రంగ ఉన్నత విద్యావకాశాలు, పరిశోధన, విద్యార్థుల బదలాయింపుతోపాటు పాఠ్యాంశాల తయారీలో తెలంగాణ ప్రభుత్వానికి కింగ్స్ కాలేజ్ తన సహకారాన్ని అందించనున్నది. ఫార్మా సిటీ , లైఫ్ సైన్సెస్ అంశాల్లో తెలంగాణ ప్రభుత్వ విజన్కు కింగ్స్ కాలేజ్ తన తోడ్పాటును అందిస్తుంది. ఈ సందర్భంగా కింగ్స్ కాలేజ్ లండన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ శితిజ్ కపూర్ మాట్లాడుతూ, టెక్నాలజీ, హెల్త్కేర్ రంగాల్లో ఉన్నత విద్య అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తాజా ఒప్పందం దోహదపడుతుందన్నారు.
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన తమ యూనివర్సిటీ ఇప్పటికే ఇండియాలోని ప్రతిష్టాత్మక సంస్థలతో అకాడమిక్ అంశాల్లో కలిసి పనిచేస్తున్నదని తెలిపారు. ముంబయిలోని టాటా మెమోరియల్ సెంటర్తో కలిసి ఆంథ్రోపాలజికల్ రీసెర్చ్ స్టడీ నిర్వహిస్తున్నామన్నారు. యూకే గవర్నమెంట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ చాంపియన్ సర్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. కింగ్స్ కాలేజ్ , తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం యుకే, ఇండియా సంబంధాల్లో మైలురాయిలాంటిదన్నారు. ఈ ఒప్పందంతో ఫార్మా రంగంలో పరిశోధన, బోధన అంశాల్లో తెలంగాణకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం, సహకారం అందుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఐటీ, జీవశాస్త్రాల రంగాలకు దేశంలోనే ప్రధాన కేంద్రంగా ఎదిగింది.
అంతేకాకుండా ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తుల్లో మూడోవంతు ఇక్కడినుంచే ఉత్పత్తి అవుతున్నాయి. అంతేకాకుండా ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ కంపెనీలు తమ రెండో కార్యాలయాలకు హైదరాబాద్ను వేదికగా చేసుకున్నాయి. ప్రస్తుతం జీవశాస్ర్తాల పర్యావరణ వ్యవస్థ విలువ 50 బిలియన్ డాలర్లకు చేరింది. కింగ్స్ కాలేజ్తో భాగస్వామ్యం తెలంగాణ రాష్ర్టాన్ని ఫార్మా, జీవశాస్ర్తాల రంగంలో ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు దోహదపడనుంది. ముఖ్యంగా పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకు ఫార్మాసిటీ ప్రధాన కేంద్రంగా మారనుందనడంలో సందేహం లేదు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కింగ్స్ కాలేజ్తో తెలంగాణ ప్రభుత్వ ఒప్పందం భారత్, యూకే సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ మారబోతుందని ఆయన పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం తమ ఫార్మా సిటీ విజన్లో భాగమన్నారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఏకో సిస్టమ్ విలువ 50 బిలియన్ డాలర్లకు చేరుతుందన్నారు. ఫార్మా పరిశోధన, శిక్షణలో ప్రపంచంలోని అత్యంత్య నైపుణ్యంగల యూనివర్సిటీతో తమ ప్రభుత్వం కలిసి పనిచేయడంపై సంతోషంగా ఉందని కేటీఆర్ చెప్పారు.