TS Minister Errabelli | దేశంలోనే అత్యంత భద్రత గల రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం హన్మకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన సురక్ష దినోత్సవం ముగింపులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పోలీసు వ్యవస్థలో సీఎం కేసీఆర్ తెచ్చిన మార్పులను ప్రజలకు తెలియజేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేశంలోనే కేవలం తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు.
పెరుగుతున్న జనాభా, నేరాలు, సైబర్ క్రైమ్.. ఏ మూలన ఏం జరిగినా డేగ కళ్ళతో పర్యవేక్షించే వ్యవస్థ ఈనాడు మన సొంతం అని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. నేరస్తులు ఏ మూలన దాగినా సకాలంలో వాళ్ళను పట్టుకోవడంలో మన పోలీసులు దేశవ్యాప్తంగా పేరు గడించారని అన్నారు. మహిళల భద్రత కోసం రాష్ట్రంలో మొత్తం 331 షీ టీమ్ లను ఏర్పాటు చేశాం అని తెలిపారు. షీ టీమ్స్కు ఇప్పటి వరకు 46,241 ఫిర్యాదులు రాగా, 19,966 మందిని అరెస్టు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015 లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు నూతనంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేశాం అని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.
కొత్తగా 5 పోలీస్ స్టేషన్లతోపాటు 3 పోలీస్ సర్కిల్, ఒక పోలీస్ డివిజనల్ కార్యాలయం, నాలుగు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశాం అని వివరించారు. పోలీస్ కమిషనరేట్ కోసం అత్యాధునిక హంగులతో సుమారు 50 కోట్ల వ్యయంతో నూతన భవన నిర్మాణాన్ని చేపడుతున్నాం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్, వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.