హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్రం చిరునామాగా నిలిచిందని తెలంగాణ గౌడ్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్రావుగౌడ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి నమూనాను దేశవ్యాప్తంగా అనుసరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఆదివారం ఆయన రాజస్థాన్లోని పుష్కర్లో నిర్వహించిన అఖిల భారత గౌడ్ల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గౌడ సామాజిక వర్గానికి వైన్స్ షాపుల్లో రిజర్వేషన్లు, గీత కార్మికులకు బీమా పథకం అమలుచేస్తున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా గౌడ్స్ ఏకమై తమ డిమాండ్ల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాజస్థాన్ కళాల్ సంఘ్ అధ్యక్షుడు సత్యనారాయణ కళాల్ తదితరులు పాల్గొన్నారు.