హైదరాబాద్ సిటీబ్యూరో/జనగామ, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ)/సైదాబాద్: హైదరాబాద్లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేండ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడి హత్యచేసిన నిందితుడు పల్లకొండ రాజు (30) ఆత్మహత్య చేసుకొన్నాడు. గురువారం ఉదయం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ వద్ద రైలుకు ఎదురెళ్లి బలవన్మరణం చెందాడు. చిన్నపెండ్యాల-నష్కల్ రైల్వేస్టేషన్ సమీపంలో రాజారాం బ్రిడ్జి 309/1-3 కిలోమీటర్
బోర్డు వద్ద ఉదయం 8.40 గంటలకు ట్రాక్ చెకింగ్ చేస్తున్న సమయంలో రాజు అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించాడని కీమెన్ సారంగపాణి తెలిపారు. ఎవరని ప్రశ్నించగా ఊరికే నిలబడ్డానంటూ కొంతదూరం ముందుకువెళ్లాడు. చిన్నారి హత్యకేసులో పోలీసులు విడుదలచేసిన ఫొటోను అప్పటికే చూసిన సారంగపాణి, ట్రాక్పై ఉన్న వ్యక్తి అతడేనని అనుమానించి సమీపంలో పనిచేసుకొంటున్న రైతులు సురేశ్, గేమ్సింగ్, రామ్సింగ్కు విషయం తెలిపాడు. అప్పటికే రాజు గూడ్స్రైలు కింద పడేందుకు విఫలయత్నం చేయడాన్ని గమనించి అతన్ని పట్టుకొనేందుకు అందరూ కలిసి ప్రయత్నించారు. రాజు తమపై రాళ్లు విసురుతూ భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడని సారంగపాణి తెలిపారు. దాంతో పోలీసులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. సంఘటనా స్థలాన్ని వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్జోషి, జనగామ డీసీపీ శ్రీనివాసరెడ్డి, స్టేషన్ఘన్పూర్ ఏసీపీ రఘునందన్ వైభవ్ గైక్వాడ్, జీఆర్పీఎఫ్ సీఐ రామ్మూర్తి సందర్శించారు. ట్రాక్ కీమెన్లు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మృతుడి ఫొటోలను కుటుంబసభ్యులకు పంపించగా అతన్ని రాజుగా గుర్తించారని వరంగల్ సీపీ తరుణ్జోషి తెలిపారు. అతన్ని పట్టుకొనేందుకు ఫొటోలు విడుదలచేసి ప్రచారం చేయటంతో తప్పించుకొనే పరిస్థితి లేదని గ్రహించి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని చెప్పారు. చేతులపై పచ్చబొట్టు, ఒంటిపై ఉన్న బట్టలు, తల జుట్టు ఆధారంగా మృతుడు రాజుగా గుర్తించామని వివరించారు. మరింత నిర్ధారణ కోసం అవసరమైతే డీఎన్ఏ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
చిన్నారి కుటుంబానికి
రాజు చేతిలో దారుణంగా హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని హోం మంత్రి మహమూద్ అలీ, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గురువారం పరామర్శించారు. ప్రభు త్వం తరుఫున రూ.20 లక్షల చెక్కును అందజేశారు. బాలిక కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు, ఔట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారంలోపే కోరుకున్న చోట డబుల్ బెడ్రూం ఇల్లు అందిస్తామని, ప్రభుత్వం తరుఫున ఆటో లేదంటే కారును జీవనోపాధి కోసం అందిస్తామని తెలిపారు. మంత్రుల వెంట హైదరాబాద్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, టీఆర్ఎస్ యాకుత్పురా నియోజకవర్గం ఇంచార్జి సామ సుందర్రెడ్డి తదితరులున్నారు. కాగా, రాజు ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిన చిన్నారి తండ్రి సభావత్ రాజు ఆనందం వ్యక్తంచేశారు. నిందితుడికి సరైన శిక్ష పడిందని అభిప్రాయపడ్డారు. అతడి మృతదేహాన్ని సింగరేణికాలనీకి తేవాలని డిమాండ్చేశారు.