తెలంగాణ సాధించుకున్న తర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అద్భుతంగా ప్రగతి పథంలో తీసుకెళుతున్న సీఎం కేసీఆర్ నాయకత్వం మరోసారి తెలంగాణకి అవసరమనే విషయాన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ వ్యవహారాలశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. వచ్చేనెలలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో శనివారం 52 దేశాల్లో బీఆర్ఎస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ జూమ్ కాల్ ద్వారా ముఖాముఖీ సమావేశమయ్యారు. బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో 52 దేశాల బీఆర్ఎస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో జూమ్ కాల్ ద్వారా మంత్రి కేటీఆర్ ముఖాముఖీ జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘జీవితంలో ఉన్నత చదువులు చదివి, వ్యాపార వాణిజ్య రంగాల్లో రాణించి విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు అంటే గ్రామాల్లో గొప్ప గౌరవం ఉంది. ఇటువంటి ప్రవాస భారతీయులు తెలంగాణ ప్రయోజనాలను కాపాడగలిగే నాయకత్వానికి ఎన్నికలలో ఓటు వేయాలని కోరితే గ్రామీణ ఓటర్లు వింటారు. రానున్న 30 రోజులు తెలంగాణకు సైతం అత్యంత కీలకం, ఒకప్పుడు కాంగ్రెస్ వల్ల తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి 60 ఏండ్లు అనేక బాధలకు గురైంది. మరోసారి దారితప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ అభివృద్ధి 50 ఏండ్లు వెనక్కి పోతుంది’ అని అన్నారు.
‘ఇప్పుడు వైద్య రంగంలో ఎంతో గణనీయ పురోగతి సాధించాం. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలిచాయి. ఇప్పుడు కార్పొరేట్ స్థాయిని మించి ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలు అందుతున్నాయి. తలసరి ఆదాయ వృద్ధిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. 2013-14లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.93,151 అయితే, ప్రస్తుతం అది రూ. 3,12,398కి చేరింది. దేశ సగటు తలసరి ఆదాయం రూ. 1.72 లక్షల కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,40,398 ఎక్కువ’ అని కేటీఆర్ తెలిపారు.
‘తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఐటీ ఎగుమతులు మూడు రెట్లు పెరిగాయి. 2014లో రూ. 66,276 కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులు.. 2023కల్లా రూ. 2,41,275 కోట్లకు ఎగబాకాయి. 264 శాతం పెరుగుదలతో ఐటీ ఎగుమతుల్లోనూ ఏ రాష్ట్రం కూడా తెలంగాణకు సాటిరాదని నిరూపించింది. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో ఐటీరంగం ముఖచిత్రమే మారిపోయింది. ప్రభుత్వ సమర్థ కార్యాచరణతో ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు 24౩ శాతం వృద్ధి చెందాయి. 2014లో ఐటీ ఉద్యోగుల సంఖ్య 3,71,774 అయితే 2023 వరకు 9,05,715 మందికి అంటే మూడు రెట్లు పెరిగింది’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
`విద్యార్థులకు విద్యాబోధనలో తెలంగాణ అమలు చేస్తున్న గురుకుల విద్య ఇప్పుడు దేశానికే రోల్మాడల్గా మారింది. ఉన్నతవిద్యలో తెలంగాణలో పనితీరు మెరుగ్గా ఉన్నది. 2014లో 298 గురుకులాలు మాత్రమే ఉండగా, 2023 నాటికి ఆ సంఖ్య 1,002కు చేరుకున్నది’ అని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
‘నేను మీ అందరిని కోరేది ఒక్కటే. మన రాష్ట్రంలో ఇపుడు ఎలక్షన్ ప్రచారం నడుస్తున్నది. తెలంగాణ రాకముందు మన పరిస్థితి ఎలా ఉంది.. ఇప్పుడు ఎంతో పురోగతితో ముందుకు వెళుతున్నది. మన కళ్ల ముందు ఎంతో పురోగతి సాధించింది. మీరు ఎన్నారైలు చాలా శక్తిమంతులు. మీరు చెప్తే మీ ఊరు, మీ ప్రాంతంలో ఎంతో గొప్పగా మీ ప్రభావం ఉంటుంది. మీరు ఈ 30 రోజులూ వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా తెలంగాణ సాధించిన అభివృద్ధిని మీ శాయశక్తుల ప్రజలకు వివరించాలి. సోషల్ మీడియా వేదికలు, ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్, ఎక్స్ ద్వారా మీ జిల్లా, మీ మండలం, మీ గ్రామంలో తెలంగాణ అభివృద్ధిని ప్రజలకు వివరించి మళ్లీ కేసీఆర్ను గెలిపించుకుందాం’ అని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
గతంలో తెలంగాణ కష్టాలు, తెలంగాణ సాధించిన అభివృద్ధిని వీడియోలు, పోస్టుల రూపంలో సోషల్ మీడియా వేదికల ద్వారా వివరించి ప్రజలను చైతన్యవంతులను చేయాలి. గత పదేండ్లలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సాధించిన ప్రగతి దృష్టిని ఉంచుకుని ప్రజల మద్దతు కోరాలి. ప్రవాస భారతీయులు సామాజిక మాధ్యమాలలో మరింత చురుగ్గా ఉంటూ, తెలంగాణకు భారత రాష్ట్ర సమితి అవసరాన్ని, ఆవశ్యకతను వివరించే ప్రయత్నం చేయాలి’ అని మంత్రి కేటీఆర్ కోరారు.
బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ, జూమ్ కాల్ ముఖాముఖీ కార్యక్రమానికి హాజరైన 52 దేశాల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ‘రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ప్రత్యక్ష ప్రచారానికి వచ్చేవారంతా సమన్వయం చేసుకోవాలి. ప్రచారానికి అందరి తేదీలు ఇవ్వాలి. ఒక ప్రెస్ మీట్ నిర్వహించుకుని ప్రత్యక్ష ప్రసారంలోకి వెళ్దాం. సోషల్ మీడియా వేదికల్లో చురుగ్గా ఉంటూ తెలంగాణ అభివృద్ధిని అందరికి చేరేలా ప్రచారం చేయాలి. ప్రచారానికి అవసరమైన మొత్తం కంటెంట్అందజేస్తాం. ప్రత్యక్ష ప్రచారం, సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం విషయమై ఏ విషయంలోనైనా సూచనలు, సలహాలు కావాలంటే మమ్ముల్ని సంప్రదించండి` అని మహేశ్ బిగాల అన్నారు. రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం, ఎన్నారై మహేశ్ తన్నీరు మాట్లాడుతూ అందరూ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొని, తెలంగాణలో సీఎం కేసీఆర్ సారధ్యంలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవాలని కోరారు.