హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తీరుపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్లోని ఓ రేషన్ దుకాణాన్ని శుక్రవారం పరిశీలించిన నిర్మలా సీతారామన్.. రేషన్ బియ్యంలో అధిక వాటా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నందున ప్రధాని నరేంద్రమోదీ ఫొటో షాపులో ఎందుకు పెట్టలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ వచ్చేసరికి ప్రధాని ఫొటో పెట్టాలని ఆదేశించారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యారు. నిర్మల అహంభావ పూరితంగా వ్యవహరించిన తీరుపై తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘కేంద్రం ఖర్చు చేసే ప్రతి రూపాయిలో తెలంగాణ వాటా ఉంది. కేంద్రానికి తెలంగాణ రూపాయి ఇస్తే.. కేంద్రం నుంచి రాష్ట్రానికి 46 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మా డబ్బు ఖర్చుచేస్తున్నందున అక్కడి రేషన్ దుకాణాల వద్ద “తెలంగాణకు ధన్యవాదాలు” అని బ్యానర్లు పెట్టే సమయం వచ్చింది’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. 2014 నుంచి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పన్నుల రూపంలో చెల్లించిన, తిరిగి ఇచ్చిన లెక్కలను ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్లో పంచుకున్నారు.