జనగామ జిల్లాలో జ్వర సర్వే జరుగుతున్న తీరును పరిశీలించిన మంత్రి
జనగామ: ‘తెలంగాణలో ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి.. ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో నిండాలి.. రాష్ట్రం ఆరోగ్య తెలంగాణ కావాలి..’ అన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంత్రి ఇవాళ జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని కుందారం, పాలకుర్తి మండలంలోని ఎల్లారాయని తొర్రూరు గ్రామాల్లో జ్వర సర్వే జరుగుతున్న తీరును మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రజలను జ్వర సర్వే జరుగుతున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజల స్పందన ఎలా ఉందని జ్వర సర్వే చేస్తున్న సిబ్బందిని ఆరా తీశారు. జ్వర సర్వే ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. కరోనా విస్తరణ ఎక్కువగా వున్నా, తీవ్రత తక్కువగానే ఉందని చెప్పారు. ప్రజలు భయపడాల్సిన పని లేదన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసమే సీఎం కేసీఆర్ జ్వర సర్వే కార్యక్రమం చేపట్టారన్నారని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఆరోగ్య సిబ్బంది వస్తారని, మీ ఆరోగ్య వివరాలు తెలుసుకుని అవసరమైన మందుల కిట్ ఇస్తారని మంత్రి చెప్పారు. కరోనా కట్టడిలో కూడా రాష్ట్రం ముందున్నదన్నారు. ఒక్క ఫోన్కాల్తో ఇంటికి వచ్చి కరోనాకు చికిత్స అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఆక్సిజన్ పడకలతో సహా అవసరమైన మందులను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందన్నారు.