హైదరాబాద్ : తెలంగాణ మిల్లెట్ మ్యాన్(Telangana Millet Man )గా పేరుగాంచిన డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) వ్యవస్థాపకుడు పీవీ సతీశ్(PV Sateesh) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. చిరు ధాన్యాలను సంరక్షించేందుకు, మహిళా రైతుల(Womens Farmers)ను ప్రోత్సహించేందుకు ఆయన 1983లో ప్రత్యేకంగా డీడీఎస్ను స్థాపించారు.
జహీరాబాద్ ప్రాంతంలో మహిళా రైతులను ఏకం చేసి వారిచే చిరు ధాన్యాల పంటలను సాగు చేయించి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఎలాంటి రసాయన ఎరువులు(chemical fertilizers ) వాడకుండా సేంద్రీయ విధానం( Organically Cultivation)లో పంటలను సాగు చేయించారు. సాగు చేసిన పంట ఉత్పత్తులను అక్కడే అదనపు విలువ జోడించి ప్యాకింగ్ చేసి పలు రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేశారు.
పాత కాలపు పంట విత్తనాలను సంరక్షించేందుకు గానూ ప్రత్యేక విత్తన బ్యాంకును ఏర్పాటు చేయించారు. దీంతో పాటు సంప్రదాయ పంటలను రక్షించడంతో పాటు భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతియేట జహీరాబాద్లో పాత పంటల పండుగను నిర్వహించారు. పీవీ సతీశ్ మరణం పట్ల వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు.