Damodar Raja Narsimha | తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) హాస్పిటళ్ల పనితీరుపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ సీ రాజనర్సింహ సమీక్షించారు. దీంతోపాటు సెకండరీ హెల్త్ కేర్ డైరక్టరేట్గా తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)ని బలోపేతం చేయడానికి తీసుకోవల్సిన చర్యలపై అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి) రూపొందించిన ప్రతిపాదనలపైనా ఆయన సమీక్షించారు. మంగళవారం హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్, అధికారులు శ్రీనివాస్, పద్మజ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి) కన్సల్టెంట్లు సుబోధ్, వీరభద్రయ్య, శ్రీదేవి, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. టీవీవీపీని సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్గా మార్చడం కోసం రూపొందించిన ప్రతిపాదనలను ఆస్కి కన్సల్టెంట్లు మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ సీ రాజనర్సింహ మాట్లాడుతూ టీవీవీపీ పరిధిలోని జిల్లా, ఏరియా హాస్పిటళ్లలోనే ఎక్కువ మంది రోగులు చికిత్స పొందుతున్నారని చెప్పారు. కనుక ఆయా హాస్పిటళ్లలో అన్ని రకాల వసతులు అందుబాటులో ఉండాలన్నారు. ప్రస్తుత అవసరాలను మాత్రమేగాకుండా, భవిష్యత్ అవసరాలు, ఓపీ, ఐపీ, పడకల స్ట్రెంత్ను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదనల్లో మార్పులు చేయాలని సూచించారు. ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ (ఐపీహెచ్ఎస్) ప్రకారం హాస్పిటల్స్లో క్లినికల్, నాన్ క్లినికల్ స్టాఫ్ ప్యాటర్న్ ఉండాలన్నారు.
ఈ మేరకు అవసరమైన అదనపు పోస్టులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని దామోదర్ సీ రాజనర్సింహ అన్నారు. డాక్టర్లు, ఇతర ఉద్యోగుల ప్రమోషన్లు, ఇతర సర్వీసు అంశాల్లో ఇబ్బందులు, లీగల్ చిక్కులు తలెత్తకుండా ప్రతిపాదనలు ఉండాలన్నారు. ఏపీలో ఏవీవీపీని సెకండరీ హెల్త్ కేర్గా మార్చినట్టు అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా, అక్కడ తలెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుని, అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
చాలాచోట్ల డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ టీచింగ్ హాస్పిటల్స్ కిందకు వెళ్లిపోయాయని మంత్రి రాజ నర్సింహకు అధికారులు తెలిపారు. కొన్ని పీహెచ్సీలు, సీహెచ్సీలు టీవీవీపీ పరిధిలోకి వచ్చాయని అధికారులు తెలిపారు. టీవీవీపీ పరిధిలోకి వచ్చిన పీహెచ్సీలు, సీహెచ్సీలకు అవసరమైన స్టాఫ్తోపాటు, ఏమేం ఎక్విప్మెంట్ అవసరమో ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రి సూచించారు. జనరల్ మెడిసిన్, సర్జరీ, గైనిక్, పీడియాట్రిక్ వంటి బేసిక్ వైద్య సేవలు అన్నీ టీవీవీపీ హాస్పిటళ్లలో అందుబాటులో ఉండాలన్నారు. 85 శాతం మంది రోగులకు జిల్లాల్లోనే వైద్యం అందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యం అని, ఈ లక్ష్యం నెరవేరాలంటే జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి సూచించారు.
హన్మకొండలోని కాకతీయ మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా ఉన్న ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్, టీబీ, కంటి దవాఖానాలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్షించారు. త్వరలో తానే వరంగల్లోని ఏజీఎం దవాకానకు వస్తానని అన్ని వార్డులు పరిశీలిస్తానని చెప్పారు. కేఎంసీ పరిధిలోని 5 హాస్పిటల్స్లో 1525 బెడ్లు అందుబాటులో ఉన్నాయని మంత్రికి అధికారులు వివరించారు. ఇందుకు అనుగుణంగా ఏమేం కావాలో ప్రతిపాదనలు పంపాలని అధికారులకు మంత్రి సూచించారు. ఎంజీఎం హాస్పిటల్లో రోగుల ఇక్కట్లపై ఆరా తీసిన మంత్రి, అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రభుత్వాలు ఎన్నికోట్లు ఖర్చు చేసినా, అంతిమంగా ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత అధికారులు, డాక్టర్లదేనని దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించే బాధత్య తమదన్నారు. ఏయే సమస్యలు ఉన్నాయో, ఏమేం అవసరాలు ఉన్నాయో రెండ్రోజుల్లో పూర్తి వివరాలతో ప్రతిపాదనలు అందించాలని మంత్రి ఆదేశించారు. కొత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి వచ్చే వరకూ ఇప్పుడున్న హాస్పిటల్స్లో రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వైద్య సేవలు అందించాలన్నారు. ఇందుకోసం అవసరమైన రిపేర్లు చేయించాలని అధికారులకు సూచించారు. పేషెంట్ల పట్ల సానుభూతితో, చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. అధికారుల మధ్య సమన్వయ లోపం ఉండకూడదన్నారు.