హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): వైద్యవిద్య అభ్యసించాలనుకొనే తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లోని ‘బీ’ క్యాటగిరీ సీట్లు 85 శాతం తెలంగాణ విద్యార్థులకు దక్కేలా నిబంధనలు సవరించింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు ఈ విద్యా సంవత్సరం (2022-23) నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. వైద్యవిద్య కోసం తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ర్టాలు, దేశాలకు వెళ్లి అగచాట్లు పడుతున్నారు. ప్రత్యేకంగా రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి రిజర్వేషన్ లేదు. దీన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. నివేదిక ఆధారంగా వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
రాష్ట్రంలో 24 మెడికల్ కాలేజీలు
ప్రస్తుతం రాష్ట్రంలో మైనార్టీ, నాన్ మైనార్టీ మెడికల్ కాలేజీలు 24 ఉన్నాయి. వీటిల్లో 50 శాతం సీట్లు రాష్ట్ర విద్యార్థులకు, మిగతా సగం మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. ఈ కోటాలో నాన్ మైనార్టీ కాలేజీల్లో 35 శాతం, మైనార్టీ కాలేజీల్లో 25 శాతం సీట్లను బీ క్యాటగిరీగా పేర్కొంటూ ఓపెన్ క్యాటగిరీలో భర్తీ చేస్తున్నారు. వీటికి దేశవ్యాప్తంగా విద్యార్థులు దరఖాస్తు చేయవచ్చు. నీట్లో వచ్చిన ఆలిండియా ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. మిగతా సీట్లను ‘సీ’ క్యాటగిరీగా (ఎన్నారై కోటా) భర్తీ చేస్తున్నారు. నీట్ సిలబస్, పరీక్ష విధానం, ఇతర కారణాల వల్ల మొదటి నుంచీ ఉత్తరాది రాష్ర్టాల విద్యార్థులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. బీ క్యాటగిరీలో ఎక్కువశాతం సీట్లు ఉత్తరాది విద్యార్థులకే దక్కుతున్నాయి.
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్లకు కృతజ్ఞతలు
ఎంబీబీఎస్ బీ క్యాటగిరీ సీట్ల భర్తీలో లోకల్ రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. సంఘం డీహెచ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లాలూప్రసాద్ రాథోడ్, వరింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ దీన్దయాళ్, డాక్టర్ ప్రశాంత్ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావులకు కృతజ్ఞతలు చెప్పారు. అలాగే తెలంగాణ ఎంబీబీఎస్ బీ క్యాటగిరీ సీట్ల లోకల్ రిజర్వేషన్ సాధన సమితి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది.