దేశమంతా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు పలు రాష్ర్టాలను కరువు కోరల్లోకి నెడుతున్నాయి. వర్షపాత లోటు, జలసంరక్షణ చేపట్టకపోవడం, జలాశయాల నీటినిల్వ సామర్థ్యాన్ని పెంచుకోని ఫలితంగా దేశంలోని 36శాతం జిల్లాల్లో కరువు ఛాయలు కమ్ముకున్నాయి. మరోవైపు తెలంగాణలో భిన్నదృశ్యం కనిపిస్తున్నది. బహుముఖ వ్యూహాల ఫలితంగా సమృద్ధిగా తాగు, సాగునీరు అందుబాటులో ఉన్నది. గత 8 ఏండ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క మండలాన్నీ కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు.
Telangana | హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): దేశాన్ని కరువు రక్కసి కాటేస్తున్నది. ప్రజలతోపాటు పశువులకు, వ్యవసాయ వినియోగానికి నీటి కొరత ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలను కరువు పీడిత ప్రాంతాలుగా నిర్ధారించింది. వర్షపాత లోటు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, జలసంరక్షణ చర్యలు చేపట్టకపోవడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోకపోవడం, సమర్థమైన నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, అటవీ నిర్మూలన తదితర అంశాలు కరువుకు ప్రధాన కారణాలని పలు నివేదికలు తేల్చిచెప్తున్నాయి. సాధారణ సగటు కంటే 90% తకువ వర్షపాతం నమోదైతే వాతావరణ కరువుగా.. నేలలో తేమ తక్కువగా ఉండటంతోపాటు నీటిపారుదల వ్యవస్థ పరిధిలోని సాగు విస్తీర్ణంలో 30% కంటే తకువగా పంటలు సాగు అవడాన్ని వ్యవసాయ కరువుగా పేర్కొంటారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల ఏదైనా ప్రాంతం లో పంటకు 50 శాతానికిపైగా నష్టం జరిగితే ఆ ప్రాంతాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటిస్తారు.
ప్రస్తుత పరిస్థితి ఇదీ..
ప్రస్తుతం దేశ మొత్తం వైశాల్యంలో కరువు పీడిత జిల్లాల విస్తీర్ణం దాదాపు 1/6వ వంతుగా ఉన్నది. దేశంలోని మొత్తం 717 జిల్లాల్లో 221 జిల్లాలు తీవ్రమైన కరువు కోరల్లో చిక్కుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత 15 సంవత్సరాల్లో దాదాపు 100 జిల్లాలు 9 సార్లు కరువు పరిస్థితులను ఎదుర్కొన్నాయని.. బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో కరువు నానాటికీ పెరుగుతున్నదని స్పష్టం చేస్తున్నాయి. 1997 నుంచి భారత్లో కరువు పీడిత ప్రాంతం ఏకంగా 57% పెరిగిందని, 2020-22 మధ్య కాలంలో దాదాపు మూడింట రెండు వంతుల మందిని కరువు ప్రభావితం చేసిందని కాప్-15 (15వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్) నివేదిక వెల్లడించింది. గత దశాబ్ద కాలంలో దేశంలోని మూడింట ఒక వంతు జిల్లాలు 4 కంటే ఎకువ సార్లు కరువును ఎదురొన్నాయని, భారత్లో ఏటా 5 కోట్ల మందిని కరువు ప్రభావితం చేస్తున్నదని ఆ నివేదిక పేర్కొన్నది. కరువు వల్ల 2018-19 నాటికి దేశంలోని మొత్తం సాగుభూమిలో దాదాపు 30% తగ్గిపోయిందని, తీవ్రమైన వ్యవసాయ కరువుల వల్ల 1998-2017 మధ్య కాలంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 2 నుంచి 5 శాతం మేరకు క్షీణించిందని 2021లో ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది.
రైతుల ఆందోళన బాట
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) మార్గదర్శకాలకు అనుగుణంగా దేశంలోని అనేక రాష్ర్టాలు కరువు పీడిత ప్రాంతాల జాబితాలను ప్రకటిస్తున్నాయి. కర్ణాటకలో 216 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించి, సాయం కోసం కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఏపీలో 103 మండలాలు, తమిళనాడులో 25 బ్లాకులు, మహారాష్ట్రలో 42 తాలుకాలు, బీహార్లో 96 బ్లాకులు, ఒడిశాలో 9 జిల్లాల్లో కరువు నెలకొన్నట్టు నిర్ధారించారు. వీటితోపాటు జార్ఖండ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాల్లోనూ దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నప్పటికీ వాటిని ఇంకా కరువు ప్రాంతాలుగా ప్రకటించలేదు. వాస్తవానికి చాలా రాష్ర్టాల్లో క్షేత్రస్థాయి పరిస్ధితులకు విరుద్ధంగా కరువును తక్కు వ చేసి చూపుతుండటంతో ఆయా రాష్ర్టాల్లో రైతులు ఆందోళన బాట పడుతున్నారు.
తెలంగాణలో భిన్నమైన పరిస్థితి
దేశంలోని చాలా ప్రాంతాలల్లో కరువు నెలకొన్నప్పటికీ తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉన్నది. గత 8 ఏండ్లలో రాష్ట్రంలోని ఒక్క మండలాన్ని కూడా కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. స్వరాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణలో జలసంరక్షణకు కేసీఆర్ ప్రభుత్వం పలు చర్యలను చేపట్టడం, బహుముఖ వ్యూహాలను అమలు చేయడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. మిషన్ కాకతీయ కింద చెరుల్లో పూడిక తీయడం, నీటి వృథాను అరికట్టడం, వాగులపై ఎక్కడికక్కడ చెక్డ్యామ్లను నిర్మించి నీటిని నిల్వ చేయడం, పలు ప్రాజెక్టులను నిర్మించి వాటిని చిన్ననీటి వ్యవస్థలకు అనుసంధానించడంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. హరితహారం ద్వారా మొక్కల పెంపకంతో పర్యావరణ వ్యవస్థలో గణనీయ మార్పులు వచ్చాయి. ఈ చర్యల ఫలితంగా కరువు రక్కసి తెలంగాణ దరిదాపుల్లోకి కూడా వచ్చే పరిస్థితి లేదు.
కరువు పీడిత ప్రాంతాలు