తెలంగాణ ఐటీ శాఖ రూపకల్పన
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగానికి సంబంధించిన డాటా మేనేజ్మెంట్ పాలసీని రాష్ట్ర ఐటీ శాఖ రూపొందిస్తున్నది. ఇప్పటివరకు దేశంలో ఇలాంటి పాలసీని ఎవరూ తీసుకు రాలేదు. వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు ఉపకరించే డాటా సేకరించి, అవసరమైన వారికి అందించే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ చేపట్టింది. ‘అగ్రికల్చర్ డాటా మేనేజ్మెంట్ పాలసీ’ పేరుతో తెలంగాణ ఐటీ శాఖ దీనికి రూపకల్పన చేస్తున్నది.
ఇందుకోసం వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రభుత్వ శాఖలైన భూపరిపాలన, నీటిపారుదల, క్యాడ్, ప్రణాళికా విభాగం, రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్లతో సంప్రదింపులు జరిపింది. ప్రజల అభిప్రాయం తెలుసుకొనేందుకు మరో వారం రోజుల్లో పాలసీని విడుదల చేయనున్నారు. ‘అగ్రికల్చర్ డాటా మేనేజ్మెంట్ పాలసీ అందుబాటులోకి వస్తే వ్యవసాయం రంగంలో మరిన్ని ఆవిష్కరణలు చేసేందుకు స్టార్టప్ కంపెనీలు ముందుకు వస్తాయని ఐటీ శాఖ అధికారులు తెలిపారు.