KCR Kit | హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకాన్ని, కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినా దానివల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయి. ఒక సమస్యను పరిష్కరించాలని భావించినప్పుడు.. దానిపై లోతుగా అధ్యయనం, సుదీర్ఘ మేధోమథనం చేసి ఏమేమి ఫలితాలు రాబట్టవచ్చో అన్ని కోణాల్లో ముందుగానే ఊహించిన తర్వాతే దాని అమలుకు కార్యాచరణ ప్రారంభిస్తారు. అందుకే ఆయా పథకాలు సామాజికంగా అనేక కోణాల్లో ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ కేసీఆర్ కిట్. స్థూలంగా దీని ప్రధాన ఉద్దేశం మాతాశిశుమరణాలకు అడ్డుకట్టవేయడమే. కానీ, లోతుగా పరిశీలించినప్పుడు ఈ పథకం వల్ల సామాజికంగా అనేక ప్రయోజనాలు కలిగాయి. కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్) నివేదిక ఈ విషయాన్ని మరోసారి స్పష్టంచేసింది. కేసీఆర్ కిట్ కల్పించిన ప్రయోజనాలను కండ్లకు కట్టింది. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ అయ్యి, పిల్లలకు టీకాలు అందించే వరకూ ఈ పథకం వల్ల కలిగిన మార్పులను వివరించింది. ఆయా సూచీల్లో దేశంలోనే తెలంగాణ టాప్లో నిలిచిందని స్పష్టంచేసింది. కేసీఆర్ కిట్ ద్వారా ఇప్పటివరకు సుమారు 30 లక్షల మంది లబ్ధిపొందగా, ప్రభుత్వం రూ.1,420 కోట్లు ఖర్చు చేసింది.
అంచనాలకు మించి రిజిస్ట్రేషన్లు
కేసీఆర్ కిట్ పొందాలంటే కచ్చితంగా గర్భిణులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్రంలో అంచనాలకు మించి గర్భిణుల నమోదు జరిగింది. హెచ్ఎంఐఎస్ ప్రకారం 2020-21లో రాష్ట్రంలో ఏఎన్సీ రిజిస్ట్రేషన్లు 103.82% నమోదుకాగా, 2021-22లో మరింత పెరిగి 108.39 శాతం నమోదైంది. తద్వారా పెద్ద రాష్ర్టాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. గుజరాత్లో 89 శాతం, మధ్యప్రదేశ్లో 82 శాతం మాత్రమే మాత్రమే ఏఎన్సీ రిజిస్ట్రేషన్లు జరిగాయి.
ఏఎన్సీ చెకప్స్లోనూ ఆదర్శం
కేసీఆర్ కిట్లో గర్భిణిగా నమోదై, కనీసం రెండుసార్లు ఏఎన్సీ చెకప్ చేయించుకున్న తర్వాతే మొదటి విడత నగదు సాయం రూ.3 వేలు అందించాలని నిబంధన ఉన్నది. దీంతో గర్భిణులకు ఏఎన్సీ చెకప్స్ నిర్వహించడంలోనూ తెలంగాణ ముందువరుసలో నిలిచింది. గర్భిణులను సురక్షితంగా దవాఖానకు తీసుకెళ్లి, పరీక్షలు చేయించి, తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అమ్మఒడి వాహనాలను సైతం అందుబాటులోకి తెచ్చింది. గర్భిణుల్లో 81 శాతం మందికి 4 ఏఎన్సీ చెకప్స్ నిర్వహిస్తున్నట్టు హెచ్ఎంఐఎస్-2022 నివేదిక వెల్లడించింది. గర్భిణులకు టీటీ, టీటీ బూస్టర్ వేయడంలోనూ తెలంగాణ 91 శాతంతో టాప్ రాష్ర్టాల్లో నిలిచింది.
తగ్గిన మాతాశిశు మరణాలు..
రాష్ట్రంలో మాతాశిశు మరణాల నిష్పత్తి (ఎంఎంఆర్) 43గా నమోదైనట్టు నివేదిక వెల్లడించింది. కేరళ తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది. పుట్టిన పిల్లలకు గంటలోపు తల్లిపాలు అందించడంలోనూ తెలంగాణ టాప్ రాష్ర్టాల్లో నిలిచింది.
ఆరోగ్యంగా శిశువులు
తెలంగాణలో 93.8 శాతం మంది పిల్లలు సరైన బరువుతో జన్మిస్తున్నట్టు నివేదిక తెలిపింది. కేసీఆర్ కిట్లో భాగంగా తరుచూ ఏఎన్సీ చెకప్స్ చేయడంతోపాటు ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం ద్వారా పోషకాహారం అందించడం, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందించడం వంటివాటి వల్ల ఇది సాధ్యమైంది.
పిల్లలందరికీ టీకాలు
కేసీఆర్ కిట్లో మూడు, నాలుగో ఇన్స్టాల్మెంట్లను పిల్లలకు మూడో నెల, తొమ్మిదో నెల టీకాలు వేసిన తర్వాత అందిస్తారు. దీంతో పిల్లలందరికీ టీకాలు అందించడంలో తెలంగాణ ముందువరుసలో నిలిచింది. రాష్ట్రంలో ప్రతి శిశువుకు మీజిల్స్, రుబెల్లా హెపటైటిస్-బీ వంటి వ్యాక్సిన్లు సమయానికి అందుతున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. ఇలా కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టడం ద్వారా సామాజికంగా అనేక రకాల ప్రయోజనాలు చేకూరాయి.
అతితక్కువ అబార్షన్లు
కేసీఆర్ కిట్లో భాగంగా గర్భిణుల నమోదు అనంతరం వైద్య సిబ్బంది ఏఎన్సీ చెకప్ల ద్వారా వారి ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన మందులు అందజేస్తున్నారు. వారు ఆరోగ్యంగా ఉండటానికి ఏయే ఆహారం తీసుకోవాలి, ఎలాంటి వ్యాయామాలు చేయాలి? వంటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. టిఫా స్కానింగ్ వంటి అత్యాధునిక పరికరాలను సైతం అందుబాటులోకి తెచ్చారు. మరోవైపు అమ్మఒడి వాహనాల్లో దవాఖానకు సురక్షితంగా తీసుకెళ్తున్నారు. వీటన్నింటి ఫలితంగా 2021-22లో దేశంలోనే అతి తక్కువ గర్భస్రావాలు (అబార్షన్లు) నమోదవుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో కేవలం 0.9 శాతం అబార్షన్లు నమోదయ్యాయి. నెలలు నిండకముందే ప్రసవాలు కూడా తెలంగాణలో అతితక్కువగా (1.12 శాతం) నమోదయ్యాయి.
100 శాతం సురక్షిత ప్రసవాలు
పేదరికం, నిరక్షరాస్యత వల్ల అవగాహనలేని కొందరు ఇంటివద్దే ప్రసవిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీనిని నివారించేందుకు ప్రభుత్వ దవాఖానలో ప్రసవిస్తేనే కేసీఆర్ కిట్ రెండో విడత సాయం రూ.4 వేలు (ఆడబిడ్డ పుడితే రూ.5 వేలు) అందించాలని నిబంధన విధించారు. దీంతోపాటు రూ.2 వేల విలువైన తల్లి, బిడ్డకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్ అందిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో వందశాతం దవాఖానల్లోనే ప్రసవాలు జరుగుతున్నాయి. దేశంలో దవాఖానల్లోనే పూర్తిగా ప్రసవాలు జరుగుతున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.