వ్యవసాయ యూనివర్సిటీ, సెప్టెంబర్ 15: చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని జాతీయ చిరు ధాన్య పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ విలాస్ థోనాఫీ కితాబిచ్చారు. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే మిల్లెట్ల సాగులో తెలంగాణ మంచి ఫలితాలు సాధిస్తున్నదని మెచ్చుకొన్నారు. ఇప్పటికే 12 జిల్లాల్లో అధికంగా చిరుధాన్యాలు పండేందుకు అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం రైతులను చైతన్య పరుస్తున్నదని చెప్పారు. బుధవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో చిరుధాన్యాల సాగు పెంచే ప్రణాళికలో భాగంగా ఈ నెల 17, 18 తేదీల్లో హైదరాబాద్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ సదస్సుకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, ఆ శాఖ అధికారులు, నిపుణులు, వ్యాపారులు, ఆదర్శ రైతులు హాజరవుతారని తెలిపారు. దేశవ్యాప్తంగా చిరు ధాన్యాల సాగును పెంచేందుకు వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, రాష్ట్రాల ప్రభుత్వాలు, రైతులకు తమ సంస్థ అండగా నిలుస్తున్నదని తెలిపారు. ప్రతి ఏడాది తమ కార్యాలయం ద్వారా 10 వేల క్వింటాళ్ల మిల్లెట్ల విత్తనాలు రైతులకు అందిస్తున్నామని చెప్పారు.