BRS | స్పెషల్ టాస్క్ బ్యూరో ప్రతినిధి హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించిన మ్యానిఫెస్టోపై యావత్తు తెలంగాణలో హర్షం వ్యక్తమవుతున్నది. ఓటు రాజకీయాలకు దూరంగా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. ఎలాంటి అతిశయోక్తులకు పోకుండా.. అమలయ్యే హామీలను మాత్రమే మ్యానిఫెస్టోలో పెట్టిన కేసీఆర్ నిర్ణయంపై తెలంగాణ సమాజం ఆనందం వ్యక్తం చేస్తున్నది. గతంలో ఇచ్చిన హామీల్లో 99 శాతం పూర్తిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. గత మ్యానిఫెస్టోలో లేని హామీలను కూడా నెరవేర్చింది. ఈసారి కూడా అదేవిధంగా ఇచ్చిన హామీలన్నింటినీ గులాబీ పార్టీ కచ్చితంగా నెరవేరుస్తుందని మెజారిటీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్కు ఈసారి కూడా బంపర్ మెజారిటీ ఖాయమని జోస్యం చెప్తున్నాయి. కేసీఆర్ ప్రకటించిన పీపుల్స్ మ్యానిఫెస్టో యావత్తు దేశానికి ఆచరణయోగ్యమైనదిగా అభివర్ణిస్తున్నాయి. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రజలను కదిలించగా, ప్రజల మ్యానిఫెస్టో అంటూ సంతోషం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం దగడపల్లికి చెందిన పోతుగంటి గాలమ్మను మ్యానిఫెస్టోపై అభిప్రాయం కోరగా.. ‘ తెలంగాణ రాకముందు రూ. 200 పింఛన్ వచ్చేది.
వచ్చినాక సీఎం కేసీఆర్ సారు ఆసరా పింఛన్ను రూ.2 వేలు చేసిండు. ఇప్పుడు మళ్ల గెలిస్తే రూ.5 వేల పింఛన్ ఇస్తానంటుండు. ముసలోల్లను ఆదుకుంటున్న కేసీఆర్ సారుకు ఓటు వేసి రూ.5 వేల పింఛన్ తెచ్చుకుంటా. ఇంట్లో ముసలోల్లమని ఎవ్వరు సరిగ్గా చూస్తలేరు. కానీ తెలంగాణ సర్కారు వచ్చాక మమ్మల్ని గుర్తించిండ్రు. ఓటుతోనే సీఎం కేసీఆర్ రుణం తీర్చుకుంటాం’ అని తెలిపారు. కరీంనగర్లోని భగత్నగర్కు చెందిన ఆటోడ్రైవర్ అబ్దుల్ రహీంను అడగ్గా గతంలో ఎవరూ చేయని పనులు కేసీఆర్ సార్ చేస్తున్నరని కొనియడారు. మ్యానిఫెస్టోల చెప్పిన ప్రతీది అమలు చేస్తరన్న నమ్మకం తమకున్నదని వెల్లడించారు. ‘నేను ఆటో నడుపుకుని బతుకుతున్న. నాకు ఏదైనా అయితే, నా కుటుంబం దిక్కులేనిది అవుతది. నా లెక్క రకరకాల పనులు చేసుకుని బతికేటోళ్లు ఉన్నరు. సంపాదించి తెచ్చి పెట్టేటోళ్లు చనిపోతే ఆ ఇల్లు చీకటై పోతది. అలాంటివారికి కేసీఆర్ సార్ నమ్మకం ఇచ్చిండు. మ్యానిఫెస్టోలో పెట్టనివి సుతం చేసిండు. మాకు షాదీముబారక్ పెట్టిండు. మా ఇంట్ల మా చెల్లికి వచ్చింది. నాకు కొడుకు పుట్టినప్పుడు కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు. రూ.12 వేలు ఇచ్చిండ్రు. లాక్డౌనపుడు మేం ఇవే పైసలతోని ఇల్లు గడుపుకున్నం. కేసీఆర్ బీమాపై ఎంతో భరోసా ఉన్నది. కేసీఆర్ సార్ చెప్పిండంటే చేసి చూపిస్తరు’ అని వివరించారు.
ప్రతి స్కీమ్ అద్భుతమే
సబ్బండ వర్గాలకు కొండంత అండగా.. ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా.. రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా కేసీఆర్ మ్యానిఫెస్టోను రూపొందించారని తెలంగాణలో ప్రతి ఒక్కరు మాట్లాడుకొంటున్నారు. లక్షల మంది అసహాయుల జీవనానికి ఆసరాగా నిలుస్తున్న సామాజిక పింఛన్ల పెంపు నిర్ణయంతో వారికి మరింత భరోసా లభించినట్టు అయ్యిందని పలువురు చెప్తున్నారు. అన్నదాతలపై తనకున్న ప్రేమ, వ్యవసాయంపై తనకున్న వాత్సల్యాన్ని ‘రైతుబంధును రూ.16 వేలకు పెంచి’ కేసీఆర్ మరోమారు నిరూపించుకొన్నారని పేర్కొంటున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు పెట్టిన గ్యాస్మంటను తగ్గించి రూ.400కే వంటగ్యాస్ సిలిండర్ను ఇస్తామంటూ కేసీఆర్ ప్రకటించడం లక్షల పేద కుటుంబాలకు ఊరటనిచ్చే అంశమని అంటున్నారు. బీపీఎల్ కుటుంబాలకు చెందిన అర్హులైన మహిళలకు దేశంలో ఎక్కడాలేని విధంగా ‘సౌభాగ్యలక్ష్మి’ పేరుతో నెలకు రూ.3 వేల గౌరవభృతి మహిళా ఆర్థిక స్వాతంత్య్రానికి ఊతంగా నిలుస్తుందని కొనియాడుతున్నారు. తెల్లరేషన్ కార్డులున్న రాష్ట్రంలోని 93 లక్షల పేదల కుటుంబాలకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రూ. 5 లక్షల బీమా అందజేయనుండటం ఓ అద్భుతమని మెచ్చుకొంటున్నారు. రేషన్పై సన్న బియ్యాన్ని సరఫరా చేస్తామంటూ కేసీఆర్ చేసిన ప్రకటనతో ప్రతి పేద కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తున్నది. ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, అగ్రవర్ణ పేదలకు గురుకులాలు, స్వశక్తి మహిళా గ్రూపులకు భవనాలు, ఉద్యోగుల పెన్షన్ స్కీమ్పై కమిటీ, మైనార్టీ సంక్షేమానికి బడ్జెట్ పెంపు, అనాథలైన పిల్లల కోసం ప్రత్యేక పాలసీ, జర్నలిస్టులకు వైద్య బీమా, గ్రేటర్ పరిధిలో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు, పేదలకు ఇండ్లస్థలాలు, అసైన్డ్ భూములపై ఆంక్షల ఎత్తివేతతో పేదలకు న్యాయం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ ఓ ట్రెండ్ సెట్టర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లప్పుడూ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి. ఆయన తీసుకొచ్చే ప్రతి పథకం దేశానికే మార్గదర్శిగా నిలుస్తున్నది. సీఎం సార్.. ట్రెండ్ ఫాలో కాడు.. ట్రెండ్ సెట్ చేస్తాడు అంతే!
– శివ, సికింద్రాబాద్
బీమాతో కొండంత ధీమా
ప్రజల గురించి తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్. అందుకే, ఆచరణ సాధ్యమైన, ప్రజామోదమైన మ్యానిఫెస్టోను మాత్రమే ప్రవేశపెట్టారు. పేద ప్రజల గుండె చప్పుడుగా ఉన్న నేత కాబట్టే, దేశంలో ఎక్కడాలేని విధంగా పేదలకు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి కొండంత ధీమా ఇచ్చారు.
– లోక లక్ష్మీరాజం, సిద్దిపేట
రైతు పక్షపాతి కేసీఆర్
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి. రైతుబంధు పథకానికి ఏడాదికి రూ.16 వేలు అందిస్తానని మ్యానిఫెస్టోలో ప్రకటించడం సంతోషం. రైతును రాజు చేయడమే కేసీఆర్ ధ్యేయం. అన్నం పెట్టే రైతుకు కేసీఆర్ న్యాయం చేస్తున్నడు. తెలంగాణలో రైతులు ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నరు.
– బూరోళ్ల్ల ఆశన్న, రైతు, ముల్లంగి, నిజామాబాద్ జిల్లా
కేసీఆర్ మాటకు తిరుగుండదు
ఏం కొందామన్నా మోదీ పెంచిన ధరలతోని ఇబ్బందిపడ్డం. గ్యాసు బుడ్డితోనైతే రపరప ఉండె. కట్టెల పొయ్యి మీద అండుకున్నం. మా పక్కింటి ఆమె అచ్చి శెప్పింది అదేదో మీటింగ్(మ్యానిఫెస్టో)ల శెప్పిండట కేసీఆర్.. గెల్సినంక బుడ్డీ ధర రూ.400కేనట అని. ఇగ మా బాధలు పోతయ్. కేసీఆర్ శెప్పిండంటే శేస్తడు.
– గుండారం చిన్న సాయమ్మ, గృహిణి, ఎడపల్లి, నిజామాబాద్ జిల్లా
కేసీఆర్ సారే ఆదుకున్రు
నా భర్త చనిపోయిండు. కేసీఆర్ సీఎం అయ్యాకే నాకు వితంతు పింఛ న్ మంజూరైం ది. ఆరోగ్యశ్రీ కార్డుతో నా కొడుక్కి ఉచితంగా ఆపరేషన్ చేసిన్రు. మా ఇంటిని నిలబెట్టింది కేసీఆర్ సారే. ఆయనే మళ్లీ రావాలి. నా ఓటు బీఆర్ఎస్కే. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా.
– ముత్యాలమ్మ, సిద్దిపేట
గ్యాస్ కష్టాలకు చెల్లు
పేద మహిళలకు నెలకు రూ.3 వేలు జీవన భృతిని అందిస్తామని కేసీఆర్ హామీ ఇవ్వటం సం తోషంగా ఉన్నది. మాలాంటి పేదలకు భృతి ఎంతో ఉపయోగపడుతుం ది. రూ. 400 సిలిండర్ నిర్ణయంతో పేదలకు గ్యాస్ కష్టాలు తీరుతాయి.
– వనితమ్మ, మేడ్చల్-మల్కాజిగిరి