హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ‘ఉత్పాదక మానవ శక్తి వనరులు’ తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ నివేదిక స్పష్టంచేసింది. రాష్ట్రంలో నవజాత శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గిందని వెల్లడించింది. ఇక జనాభా నియంత్రణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, పునరుత్పాదక రేటు అతి తక్కువగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని పేర్కొన్నది. రాష్ట్రంలో నమోదవుతున్న మొత్తం మరణాల్లో 15-59 ఏండ్ల మధ్య వయస్కులు 37 శాతానికిపైగా ఉన్నట్టు చెప్పింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) తాజాగా ‘స్టాటిస్టికల్ రిపోర్ట్-2020’ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పరిస్థితులపై, ప్రజల జీవన విధానంపై అధ్యయనం చేసి ఈ నివేదికను విడుదల చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ నివేదికలో పలు ఆసక్తికర అంశాలు ఉన్నాయి.
మేధాశక్తి, శ్రామిక శక్తి తెలంగాణలోనే అధికం
సాధారణంగా 15-59 ఏండ్ల మధ్య వయస్కులను ‘ఉత్పాదక శక్తి’ వనరులుగా (వర్కింగ్ ఏజ్) పిలుస్తుంటారు. అత్యధిక శాతం మేధోశక్తి, శ్రామిక శక్తి వనరులు ఈ వయసు వర్గంలోనే ఉంటారు. అత్యధికంగా వర్కింగ్ ఏజ్ జనాభా తెలంగాణలోనే ఎక్కువ ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. రాష్ట్ర జనాభాలో 15-59 ఏండ్ల మధ్య వయస్కులు 72 శాతం ఉన్నట్టు తెలిపింది. ఇందులో పురుషులతో పోల్చితే మహిళల సంఖ్యే ఎక్కువగా ఉండటం విశేషం. రాష్ట్రంలోని పురుష జనాభాలో 71.7 శాతం మంది వర్కింగ్ ఏజ్ గ్రూప్ కాగా, మహిళల్లో 72.3 శాతం మంది ఉన్నారు. దేశంలోనే అత్యధిక వేగంగా తెలంగాణ నగరీకరణ చెందుతున్న నేపథ్యంలో సహజంగానే వర్కింగ్ ఏజ్ జనాభా పట్టణాల్లో ఎక్కువగా ఉన్నది. పట్టణ ప్రాంత జనాభాలో ఈ వయస్కులు 72.9 శాతం మంది ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 71.5 శాతం ఉన్నారు. జాతీయ సగటు వర్కింగ్ ఏజ్ గ్రూప్ 67.1 శాతంగా ఉన్నది. పురుషుల్లో 66.8 శాతం, మహిళల్లో 67.3 శాతం మంది 15-59 ఏండ్ల మధ్య ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. జాతీయ సగటు కన్నా తెలంగాణలో ఉత్పాదక మానవ శక్తి వనరులు సుమారు 5 శాతం ఎక్కువగా ఉన్నాయి.
పిల్లల మరణాలు 38 శాతం తగ్గాయ్
రాష్ట్రంలో మాతాశిశుమరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, ఆరోగ్యలక్ష్మి వంటి పథకాలతోపాటు టీకాలు వేయడం, ఏఎన్సీ, పీఎన్సీ చెకప్ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దీంతో శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆరోగ్యంగా ఎదుగుతున్నది. దీనికి తోడు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా ఎంసీహెచ్లను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ, ప్రస్తుతం ఉన్న దవాఖానల ఆధునికీకరణ వంటి చర్యల ఫలితంగా మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో రాష్ట్రంలో మాతృమరణాలు, నవజాత శిశుమరణాలు, శిశు మరణాలు, ఐదేండ్లలోపు పిల్లల మరణాలు వంటివి గణనీయంగా తగ్గాయి. ఎస్ఆర్ఎస్ నివేదిక సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
జనాభా నియంత్రణలో భేష్
జనాభా నియంత్రణలోనూ తెలంగాణ దేశంలోని అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. దేశంలోనే అతితక్కువ సంతానోత్పత్తి రేటుతో (టోటల్ ఫర్టిలిటీ రేట్) దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. పైగా దేశవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు తగ్గిన రాష్ర్టాల్లో తెలంగాణ కూడా నిలిచింది. 2015లో రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.8 గా ఉండగా.. 2020 నాటికి 1.5కి తగ్గింది. 1.4 రేటుతో ఢిల్లీ, తమిళనాడు పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలువగా తెలంగాణ, ఏపీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్ సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచాయి.
37 శాతం మరణాలు వారివే..
నివేదిక ప్రకారం రాష్ట్రంలో వర్కింగ్ ఏజ్ గ్రూప్ అత్యధికంగా ఉన్నట్టే.. మరణాల్లోనూ మూడింట ఒక వంతు ఆ వయస్కులవే నమోదవుతున్నాయి. 2020లో రాష్ట్రంలో నమోదైన మొత్తం మరణాల్లో 15-59 మధ్య వయస్కులవి 37 శాతం కావడం వారివే. మొత్తం మరణాల్లో 14 ఏండ్లలోపు వారు 7 శాతం మంది ఉండగా, 60 ఏండ్లకు పైబడిన వారు సుమారు 56 శాతం మంది ఉన్నారు.