హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇస్టా గుర్తింపుతో ఏర్పాటు చేసిన విత్తన పరీక్ష కేంద్రం అద్భుతమని కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి మనోజ్ అహుజా ప్రశంసలు కురిపించారు. శనివారం రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావుతో కలిసి రాజేంద్రనగర్లోని సీడ్ టెస్టింగ్ ల్యాబ్ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ఉద్యోగులతో ల్యాబ్లో సౌకర్యాలు, విత్తన పరీక్షల విధానంపై చర్చించి పలు విషయాలను తెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీడ్ టెస్టింగ్ ల్యాబ్తో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.
వీటి ద్వారా నాణ్యమైన విత్తనాలను రైతులకు చేర్చి.. అధిక దిగుబడులు సాధించేందుకు ఆస్కారం ఉన్నదని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో విత్తన పరీక్ష విధానాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే తెలంగాణలోని సీడ్ టెస్టింగ్ ల్యాబ్ మాదిరిగా దేశవ్యాప్తంగా ల్యాబ్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఇందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఇటీవల ప్రతిష్ఠాత్మక ఎంఎస్ స్వామినాథన్ అవార్డు అందుకున్న విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులును అభినందించారు.