హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : నిరుద్యోగులను కాంగ్రెస్ సర్కార్ మరోసారి మోసంచేసింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో గరిష్ఠ వయోపరిమితిని 46 ఏండ్ల నుంచి 44 ఏండ్లకు తగ్గించింది. ఇటీవలే జీవో-86ను జారీచేసింది. ఈ సడలింపు ఏడాది మాత్రమే వర్తిస్తుందని సర్కార్ వెల్లడించింది. ప్రభుత్వ నిర్ణయంతో తమకు రెండు రకాల నష్టం జరుగుతుందని నిరుద్యోగ జేఏసీ నేతలంటున్నారు. గత కేసీఆర్ సర్కార్ 10 ఏండ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చింది. దీంతో జనరల్ క్యాటగిరీవారు 44, ఎస్సీ, ఎస్టీ, బీసీలు 49, దివ్యాంగులు 54 ఏండ్ల వయస్సులోనూ ఉద్యోగాలకు పోటీపడే అవకాశం ఇచ్చింది. మొత్తంగా 18 ఏండ్ల నుంచి 54 ఏండ్ల వయస్సున్న వారు అప్పట్లో కొలువులకు పోటీపడ్డారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ పదేండ్లకు తోడు అదనంగా రెండేండ్లు ఇవ్వగా 12 ఏండ్లు సడలింపు దొరికింది. కానీ ఇప్పుడు 44 ఏండ్లు(పదేండ్ల) సడలింపు ఇచ్చింది. దీంతో అన్ని క్యాటగిరీల్లోనూ రెండేండ్లు తగ్గిపోయింది. ఇప్పుడు ఇచ్చిన పదేండ్ల సడలింపు ఏడాదిపాటే వర్తించనున్నది.
అత్యంత కీలకమైన యూనిఫామ్ సర్వీసులకు వయోపరిమితి సడలింపు వర్తించదు. పోలీసు, ఎక్సైజ్, అగ్నిమాపకశాఖ, జైళ్లశాఖ, అటవీశాఖల్లో ఉద్యోగాల భర్తీలో సడలింపు ఉండదు. 34 ఏండ్ల లోపున్న వాళ్లే ఈ పోస్టులకు అర్హులు.
కాంగ్రెస్ సర్కార్ రెండేండ్లు వయోపరిమితి సడలింపు ఇచ్చినా.. సర్కార్ ఒక్క చొప్పుకోదగ్గ నోటిఫికేషన్ జారీచేయలేదు. దీంతో వయోపరిమితి సడలింపు ఉత్తిదే అయ్యింది. అదే బీఆర్ఎస్ పాలనలో పదేండ్ల సడలింపు ఇచ్చింది. పరిపాలన సజావుగా సాగటం కోసం అవసరమైన 1,12,307 కొత్త పోస్టులు మంజూ రు చేసింది. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం టీజీపీఎస్సీ ద్వారా 36వేల పోస్టులు భర్తీచేయగా, 2022లో 80,039 ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ సర్కార్ 67,763 ఉద్యోగార్థులకు నియామకపత్రాలు అందజేయగా.. ఈ నోటిఫికేషన్లు అన్నీ బీఆర్ఎస్ సర్కార్ జారీచేసినవే.