మహబూబ్నగర్ : రాష్ట్రంలో లౌకికవాదం, మతసామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని హోం శాఖ మంత్రి మహమూద్అలీ(Minister Mahamood Ali ) అన్నారు. ఆదివారం మహబూబ్నగర్(Mahaboobnagar) జిల్లా కేంద్రంలోని ఎస్ఎం ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ నాయకుడు మహ్మద్హనీఫ్అహ్మద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో విభిన్న మతాలు, భాషలు, రాష్ట్రాల ప్రజలు కలిసి జీవించే తెలంగాణలో గంగా జమునా తెహజీబ్ సంస్కృతి శతాబ్దాలుగా కొనసాగుతుందని అన్నారు. సీఎం కేసీఆర్(CM KCR) ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని కొనియాడారు. ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్(Minister Srinivas goud) మాట్లాడుతూ తెలంగాణ వంటి సెక్యులర్ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేదన్నారు.
దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కేంద్రం విక్రయిస్తూ యువతకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నదని ఆరోపించారు. కులమతాల పేరిట కుట్రలు, రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతుందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ఇసాక్, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్, నాయకులుహనీఫ్ అహ్మద్, మోసీన్ఖాన్, మహ్మద్ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.