హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లపై దినపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసింది.
నాగర్కర్నూలు జిల్లా, అమ్రాబాద్ మండలం, మన్ననూర్ గ్రామంలోని గిరిజన సంక్షేమ బాలుర గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర నివేదికను సమర్పించాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ను కమిషన్ ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేనెల 11కు వాయిదా వేసింది.