TS High Court : గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్లను నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు మంగళవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం యథాతథ స్థితినే కొనసాగించాలని, తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కొత్త సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించవద్దని తన ఆదేశాల్లో పేర్కొన్నది. దాంతో హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్లు ప్రమాణం చేయడానికి వీల్లేకుండా పోయింది.
ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ఖాన్లను నియమించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో కోర్టు తాజా ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది. కాగా, కొద్ది నెలల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు నామినేట్ చేసింది. అయితే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వారి పేర్లను తిరస్కరించారు.
అయితే గవర్నర్ తమ నియామకాలకు ఆమోదం తెలుపకపోవడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ రాష్ట్ర హైకోర్టుకు వెళ్లారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని.. దాన్ని తిరస్కరించే హక్కు గవర్నర్ లేదని వారు పేర్కొన్నారు. ఆ పిటిషిన్ హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఈలోపే కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరామ్, అమీర్ అలీఖాన్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించడం, గవర్నర్ ఆమోదం తెలపడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టుకు వెళ్లారు.