మెదక్, జూన్ 17 (నమస్తే తెలంగాణ)/మెదక్ మున్సిపాలిటీ/గజ్వేల్: రాష్ట్ర ప్రభుత్వ కృషితో అన్ని జిల్లా కేంద్రాల్లో కొత్తగా కోర్టు భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయని త్వరలోనే వాటిని ప్రారంభించుకుంటామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారం అభినందనీయమని తెలిపారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కోర్టు భవనాలు, క్వార్టర్స్, సిద్దిపేట కోర్టు మూడు, నాలుగో అంతస్థుల భవన నిర్మాణాలకు, మెదక్ కోర్టు సముదాయంలో రూ.5 కోట్లతో నిర్మించనునున్న మూడో అంతస్థు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల జరిగిన కార్యక్రమాల్లో జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ.. కేసులను ఏండ్ల తరబడి పెండింగ్లో ఉంచడం సరికాదని అన్నారు. కేసుకు సంబంధించిన సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకొని త్వరగా పరిష్కరించాలని సూచించారు. కోర్టుకు వచ్చే వారికి న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగేలా చూడాలని అన్నారు.
న్యాయ వ్యవస్థకు బార్-బెంచ్ రెండు చక్రాలు వంటివని, ఇవి రెండు సక్రమంగా పని చేస్తేనే కేసులు సత్వర పరిషారమై కక్షిదారులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంతోష్రెడ్డి, జస్టిస్ నవీన్రావు, జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి, సిద్దిపేట జిల్లా న్యాయమూర్తి రఘురామ్, సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మెదక్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి లక్ష్మీశారద, మెదక్ కలెక్టర్ రాజర్షి షా తదితరులు పాల్గొన్నారు. అనంతరం మెదక్ చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అక్కడి నుంచి ఏడుపాయల వెళ్లి వన దుర్గామాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.