హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని హైకోర్టు న్యాయవాదుల సమావేశంలో తీర్మానం చేశారు. ఆదివారం నాడు మంత్రుల నివాసంలోని క్లబ్ హౌస్లో హైకోర్టు న్యాయవాదుల సమావేశం జరిగింది. దీనిలో సీనియర్ న్యాయవాదులుగా గుర్తింపు పొందిన గండ్ర మోహన్ రావు, అయ్యాడపు రవీందర్ రెడ్డిలను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. న్యాయవాదులు చేసిన తీర్మానాన్ని స్వాగతించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు తెలంగాణలో పర్యటిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై నోటికొచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యమైన అంశం కాదని అన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా బీజేపీ నాయకులు విమర్శలు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని నీతి ఆయోగ్ కూడా గుర్తించి, పలుమార్లు ప్రశంసలు కురిపించిందని గుర్తుచేశారు. ఈ సమావేశంలో సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరి శంకర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.