హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకపు అమలును నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వును హైకోర్టు గురువారం మరోసారి పొడిగించింది. తుది ఉత్తర్వులు వెలువడే వరకు గత నెల 30న వెలువరించిన మధ్యంతర స్టేటస్ కో ఉత్తర్వులు అమల్లో ఉంటాయని వెల్లడించింది. ఈ కేసులో కోదండరాం, అమీర్ అలీఖాన్లను ప్రతివాదులుగా చేర్చుతూ దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను హైకోర్టు అనుమతించింది. వారిద్దరినీ ప్రతివాదులుగా పరిగణించి నోటీసులు జారీచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్కుమార్ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి విచారణ శుక్రవారం కొనసాగనుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా మంత్రివర్గ ఆమోదంతో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణలను నియమించాలని గత ప్రభుత్వం గవర్నర్కు ప్రతిపాదనలు పంపింది. వారి నామినేషన్లను తిరసరిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని దాసోజు, కుర్ర వేర్వేరుగా హైకోర్టులో సవాల్ చేశారు.
కేవలం కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగానే గవర్నర్ వారి నామినేషన్లను తిరస్కరించారని దాసోజు, కుర్ర తరఫు న్యాయవాదులు వాదించారు. కుర్ర సత్యనారాయణ ఎస్సీ వర్గానికి చెందిన కార్మిక నాయకుడని, దాసోజు బీసీ వర్గానికి చెందినవారని, పీఆర్పీ వ్యవస్థాపకుల్లో ఒకరని, బీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా ఉన్నారని చెప్పారు. వీరు రాజకీయాల్లో ఉన్నారన్న నెపంతో గవర్నర్ వారిని తిరస్కరించడం దారుణమని అన్నారు. పలు రాష్ర్టాల్లో రాజకీయాల్లో ఉన్నవారినే గవర్నర్లు నామినేట్ చేశారని తెలిపారు.
రాజకీయనేతలని చెప్పి దాసోజు, కుర్ర నామినేషన్లను తిరసరించిన గవర్నర్.. ఓ రాజకీయపార్టీని స్థాపించిన కోదండరాం, అమీర్ అలీఖాన్లను నియమించేందుకు చకచకా చర్యలు తీసుకున్నారని చెప్పారు. వీరిద్దరి విషయంలో గవర్నర్ ఆగమేఘాల మీద నియామక ప్రక్రియ పూర్తి చేశారని వివరించారు. ఓవైపు ఇదే హైకోర్టులో పిటిషనర్లు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరుగుతుండగానే గవర్నర్ ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని న్యాయవాదులు ప్రశ్నించారు. మంత్రివర్గం రెండోసారి చేసే సిఫార్సులను గవర్నర్ ఆమోదించి తీరాల్సిందేనని అన్నారు.
దాసోజు, కుర్రాలను ఎమ్మెల్సీలుగా నియమించాలని కేసీఆర్ మంత్రివర్గం 2023 జూలై 31న చేసిన తీర్మానాన్ని రేవంత్రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందని అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్రెడ్డి చెప్పారు. దీంతో పిటిషనర్ల పేర్లను తొలగించి, తిరిగి తాజా నిర్ణయం తీసుకునే క్రమంలోనే మరో ఇద్దరి పేర్లను సిఫార్సు చేసిందని చెప్పారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు ఆసారం లేదని, పిటిషన్లు విచారణార్హం కాదని అన్నారు. కోదండరాం, అలీఖాన్ల పేర్లకు గవర్నర్ ఆమోదం చెప్పడంతో గెజిట్ నోటిఫికేషన్ కూడా వెలువడిందని చెప్పారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం నోటిఫికేషన్ వెలువడ్డాక కోర్టుల జోక్యానికి ఆసారం లేదని, ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని చెప్పారు.