ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
పిల్పై ముగిసిన విచారణ
హైదరాబాద్, ఫిబ్రవరి 9 : అర్హత లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా కార్లపై ఎర్రబుగ్గను పెట్టుకొని తిరిగేవారిపై చర్యలు చేపట్టాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసింది. ఎర్ర బుగ్గ కార్ల వినియోగంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావిలి ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. కార్లపై ఎర్రబుగ్గలు పెట్టుకోరాదని 2017లో ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు అమలు కావడంలేదని, ఇప్పటికీ ఎంతోమంది అధికారులు, రాజకీయ నాయకులు తమ కార్లపై ఎర్రబుగ్గలను ఉపయోగిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీన్ని విభేదిస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్పై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఎర్రబుగ్గ కార్ల వినియోగంతోపాటు వాటికి ఉపయోగించే సైరన్ల విషయంలో కూడా మోటారు వాహనాల చట్టాన్ని అమలు చేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ.. పిల్పై విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించింది.