చార్మినార్, జనవరి 31: కంప్యూటర్ కీబోర్డు టైపింగ్లో హైదరాబాద్ న్యాయవాది ఎస్కే అష్రఫ్ ప్రపంచ రికార్డును నెలకొల్పారు. హైకోర్టు న్యాయవాదుల సమక్షంలో ఆయన కీబోర్డుపై ఉన్న అక్షరాలను కేవలం 2.69 సెకన్లలో టైప్ చేయడంతో ఇప్పటివరకు ఉన్న 3.70 సెకన్ల రికార్డు చెరిగిపోయింది. అష్రఫ్ ఫీట్ను గిన్నిస్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు గుర్తించారు.
దీంతో హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వీ రఘునందన్, స్పోర్ట్ అండ్ కల్చరల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యదదర్శి శారద కటకం, ఉపాధ్యక్షుడు కల్యాణరావు, కార్యదర్శి కట్టా ప్రదీప్కుమార్, ట్రెజరర్ వీ పూర్ణశ్రీ సీనియర్ సభ్యులు శ్రీనివాస్రావు కల్లకూరి, ఎం శ్రీనివాస్రావు తదితరులు అష్రఫ్ను అభినందించారు. ఈ సందర్భంగా అష్రఫ్ మాట్లాడుతూ.. మున్ముందు మరికొన్ని రికార్డులు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.