హైదరాబాద్, ఆగస్టు (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. పేపర్-1 ఫలితాల్లో తెలంగాణకు చెందిన ఐదుగురు విద్యార్థులు వంద ఎన్టీఏ స్కోర్తో సత్తాచాటారు. రాష్ర్టానికి చెందిన ధీరజ్ కురుకుంద, అనికేత్ ఛటోపాధ్యాయ్, జాస్తి యశ్వంత్ వీవీఎస్, రూపేశ్ బియాని, బూస శివనాగ వెంకటఆదిత్య 100 ఎన్టీఏ స్కోర్ను సాధించారు. జాతీయస్థాయిలో 24 మంది విద్యార్థులే 100 పర్సంటైల్ సొంతం చేసుకోగా, అందులో ఐదుగురు తెలంగాణ విద్యార్థులే. అంటే 100 ఎన్టీఏ స్కోర్ సాధించిన వారిలో 20% వాటా తెలంగాణ విద్యార్థులదే. జూన్లో నిర్వహించిన మెయిన్-1, జూలైలో నిర్వహించిన మెయిన్-2 ఫలితాలను కలిపి తుది ఫలితాలను ఎన్టీఏ సోమవారం విడుదల చేసింది. ఈ స్కోర్ ఆధారంగా 2.5 లక్షల మంది విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్డ్ రాసే అవకాశం కల్పిస్తారు. సోమవారం నుంచే రిజిస్ట్రేషన్ ప్రారంభంకాగా, 11 వరకు సమయం ఉన్నది. అడ్మిట్కార్డులు 23 నుంచి 28 వరకు జారీచేస్తారు. 28న అడ్వాన్స్డ్ ఎగ్జామ్ నిర్వహిస్తుండగా, ఫలితాలు సెప్టెంబర్ 11న విడుదలవుతాయి.
క్యాటగిరీ ర్యాంకుల్లోనూ టాప్
ఈ ఫలితాల్లో క్యాటగిరీ ర్యాంకుల్లోనూ తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. జాతీయ మేల్ టాపర్లుగా 18 మంది నిలువగా, ఐదుగురు తెలంగాణ విద్యార్థులే. మేల్ టాపర్స్గా ధీరజ్ కురుకుంద, అనికేత్ ఛటోపాధ్యాయ్, జాస్తి యశ్వంత్ వీవీఎస్, రూపేశ్ బియాని, బూస శివనాగ వెంకటఆదిత్య నిలువగా, ఫిమేల్ క్యాటగిరీలో చందా మౌమిత స్టేట్ టాపర్గా నిలిచింది. ఎస్సీ క్యాటగిరీలో కాకర జశ్వంత్ జాతీయస్థాయిలో మూడోర్యాంక్, ఎస్టీ క్యాటగిరీలో మాలోత్ విశాల్నాయక్ జాతీయస్థాయి ఐదోర్యాంక్ సొంతం చేసుకొన్నారు. పీడబ్ల్యూడీ క్యాటగిరీలో గైకోటి విఘ్నేశ్ జాతీయస్థాయిలో మూడోర్యాంక్, మందల రాహుల్ జాతీయస్థాయిలో ఐదో ర్యాంక్తో అదరగొట్టారు.
రెండుసార్లు 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ రెండింటిలోను 100 పర్సంటైల్ వచ్చింది. ఇంటర్లో 988 మార్కులు వచ్చాయి. మొదటి నుంచి ప్రణాళికతో చదవడంతోనే ఇది సాధ్యమైంది. సాఫ్ట్వేర్రంగంలో రిసెర్చ్చేసి కంపెనీ పెట్టాలన్నది ఆశయం. ఐఐటీ బాంబే లేదా ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్లో చేరుతా. అడ్వాన్స్డ్లోనూ సైతం మంచి ర్యాంక్ వస్తుందని ఆశిస్తున్నా.
– ధీరజ్ కురుకుంద
స్టాఫ్వేర్రంగంలో స్థిరపడతా
జేఈఈ మెయిన్లో ఆలిండియా 19వ ర్యాంక్ సాధించా. నా టార్గెట్ జేఈఈ అడ్వాన్స్డ్. మంచి ర్యాంక్ సాధించి ఐఐటీ బాంబేలో చేరాలన్నది లక్ష్యం. బీటెక్ తర్వాత ఎంఎస్ చేసి సాఫ్ట్వేర్రంగంలో స్థిరపడాలనుకుంటున్నా. ఇంటర్లో 981, ఏపీ ఎంసెట్లో 7వ ర్యాంక్ వచ్చింది.
– బూస శివనాగ వెంకట ఆదిత్య
రోబోటిక్స్ రంగంలో రాణిస్తా
మెయిన్-1లో 100 పర్సంటైల్, మెయిన్-2లో 99.99 పర్సంటైల్ సాధించా. అడ్వాన్స్డ్లో మంచి ర్యాంక్ సాధించి ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్లో చేరుతా. రోబోటిక్స్ రంగంలో స్థిరపడాలని అనుకుంటున్నా. జేఈఈ కోసం రోజుకు 14 గంటలు చదివేవాడిని.
– జాస్తి యశ్వంత్ వీవీఎస్
రిసెర్చ్కే నా ఓటు
మొదటిసారి 100 ఎన్టీఏ స్కోర్ రాగా.. ఇప్పుడు రాలేదు. అడ్వాన్స్డ్ పూర్తయ్యాక ఐఐటీ బాంబే లేదా ఢిల్లీలో చేరాలనుకొంటున్నా. సీఎస్ఈ కోర్సులో చేరుతా. బీటెక్ తర్వాత ఉన్నత చదువులు కొనసాగిస్తా. ఇంజినీరింగ్, మెడికల్ విభాగాల్లో రోబోటిక్స్ను మరింతగా వినియోగించేలా పరిశోధనలు చేస్తా.
– అనికేత్ ఛటోపాధ్యాయ్