హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో 3,93,845 మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీలు) ఉన్నాయని లోక్సభలో కేంద్రం వెల్లడించింది. మిగతా రాష్ర్టాలతో పోల్చితే దేశంలో తెలంగాణ 8వ స్థానంలో ఉన్నదని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో 8,27,133 సంఘాలు, కర్ణాటకలో 2,97,982, మహారాష్ట్రలో 6,67,562, తమిళనాడులో 3,48,977 సంఘాలు ఉన్నట్టు పేర్కొన్నది.
దేశవ్యాప్తంగా 92,30,743 ఎస్హెచ్జీలు ఉన్నాయని వివరించింది. 13,53,025 ఎస్హెచ్జీలతో బీహార్ దేశంలో మొదటిస్థానంలో ఉన్నదని తెలిపింది. ఇటీవల లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఎస్హెచ్జీ మహిళల వార్షిక ఆదాయాన్ని రూ.లక్ష లేదా అంతకంటే ఎకువకు పెంచే లక్ష్యంతో ‘లఖ్ పతి దీదీ’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు.