Medaram Jathara | ములుగు, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): సమ్మక్క, సారలమ్మ నామస్మరణతో మేడారం ఉప్పొంగింది. సమ్మక్కకో.. సారక కో అంటూ గద్దెల ప్రాం గణం మార్మోగింది. శివసత్తుల పూనకాలతో వనం ద ద్దరిల్లింది. చీర, సారె, నిలువెత్తు బంగారం(బెల్లం), ఎదురోళ్లు, ఒడిబియ్యం, కొబ్బరికాయలు.. తీరొక రూపాల్లో భక్తులు అమ్మవార్లకు మనసారా మొక్కులు చెల్లించుకొన్నారు. శుక్రవారం ఒకరోజే సుమారు 60 లక్షల మంది మొకులు చెల్లించుకోగా ఇప్పటివరకు ఈ సంఖ్య కోటిన్నర చేరినట్టు అధికారులు అంచనా వేశారు. అమ్మల ప్రసాదం(బెల్లం) కోసం భక్తులు పోటీపడ్డారు. పసుపు, కుంకుమ కోసం పరితపించారు. పవిత్ర మాఘశుద్ధ పౌర్ణమి (సమ్మకల పున్నం) రోజున వన దేవుళ్లు.. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరడంతో దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. శుక్రవారం ఉదయం నుంచే క్యూలైన్లు, గద్దెల పరిసరాలు భక్తులతో కికిరిసిపోయాయి.
అంచనాకు మించి భక్తజనం
ఈ సారి జాతరకు కోటి 20 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. అయితే జాతర ముగిసేందుకు శనివారం వరకు సమయం ఉండగా.. శుక్రవారం నాటికి దర్శనం చేసుకొన్న భక్తుల సంఖ్య కోటి 50 లక్షలకు చేరింది. ముఖ్యంగా సమ్మక్క, సారలమ్మలిద్దరూ గద్దెలపై కొలువై ఉండటంతో శుక్రవారం దర్శనం చేసుకొనేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. అధికారిక లెకల ప్రకారమే శుక్రవారం ఒకరోజే రికార్డు స్థాయిలో 60 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. అంతకుముందు గురువారం వరకు ముందస్తు మొకులతో కలిసి 90 లక్షల మంది భక్తులు మొక్కలు చెల్లించుకొన్నారు. దానితో ఇప్పటి వరకు కోటి 50 లక్షల మంది మేడారం వచ్చి వనదేవతలను దర్శించుకున్నట్టయింది. జాతర చివరి రోజైన శనివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగనున్నది. మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన గిరిజనులు సంప్రదాయ పద్ధతుల్లో డప్పుల మోతలు, బాకాలు, బూరలనాదాలతో వచ్చి అమ్మవార్లకు మొక్కలు చెల్లించుకొన్నారు. శనివారం దేవతల వనప్రవేశంతో మహా జాతర ముగియనున్నది. ఆ లోపే మొక్కలు చెల్లించుకొనేందుకు భక్తులు తరలివస్తున్నారు. జాతర ఆరంభమైన బుధవారం నుంచి శుక్రవారం వరకు జంపన్న వాగులో జనప్రవాహం కొనసాగింది.
తల్లుల దీవెనలు పొందిన గవర్నర్, సీఎం
మేడారంలో గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మను శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకొన్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రి అర్జున్ముండా, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్కతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు సైతం అమ్మవార్లను దర్శించుకొని తమ ఎత్తు బెల్లం బుట్టలను తల్లులకు సమర్పించారు.
నేడు జనదేవతల వనప్రవేశం
భక్తకోటిని దీవించి, ఆశీర్వదించిన సమ్మక్క శనివారం సాయంత్రం తిరిగి వనప్రవేశం చేస్తుంది. సారలమ్మ కన్నెపల్లికి వెళ్లిపోతుంది. పగిడిద్దరాజు పూనుగుండ్లకు, గోవిందరాజులు కొండాయికి అదే సమయంలో వెళ్లిపోనున్నారు. ఆదివాసీ గిరిజన సంప్రదాయాల ప్రకారం వడ్డెలు గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తల్లులను ఎక్కడి నుంచి తోడ్కొని వస్తారో తిరిగి అక్కడికే సాగనంపుతారు. ఈ తంతును వనప్రవేశంగా పిలుచుకొనే ఆచారం కొనసాగుతూ వస్తున్నది. వనదేవతలు జనప్రవేశం చేసి రెండు రోజులు భక్తులకు దర్శనమిచ్చి తిరిగి వనప్రవేశం చేయడంతో రెండేండ్ల మహాజాతర పరిసమాప్తి అవుతుంది.