నకిరేకల్, జనవరి 11 : కేజీ టు పీజీ విద్య సీఎం కేసీఆర్ కల అని, అందుకు ప్రతిరూపమే రాష్ట్రంలో 1,150 గురుకుల జూనియర్ కళాశాలలు, 85 డిగ్రీ కళాశాలలు, రెండు పీజీ కళాశాలలు ఏర్పాటైనట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.1.6 కోట్లతో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణం, ఇతర పనులకు బుధవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. పేద, మధ్యతరగతి వర్గాలకు గుణాత్మక విద్యను అందించేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు వెచ్చిస్తూ ప్రైవేటుకు దీటుగా మెరుగైన విద్యను అందిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా పోటీ పడేలా ఒకటోతరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం బోధిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80 వేల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో నల్లగొండ, యాదాద్రి జిల్లాల జడ్పీ చైర్మన్లు బండ నరేందర్రెడ్డి, ఎలిమినేటి సందీప్రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, గొర్రెలు, మేకల పెంపకందారుల సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, నల్లగొండ కలెక్టర్ టీ వినయ్కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.