నల్లగొండ ప్రతినిధి,(నమస్తే తెలంగాణ)/నిడమనూరు,మార్చి23: ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో తలమునకలైన వేళ అధికార యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది. కీలకమైన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం పాత తాలూకా కేంద్రమైన నిడమనూరు తాసీల్దార్ కార్యాలయంలో ప్రారంభమైంది. తొలిరోజే ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. హైదరాబాద్లోని ఇందిరానగర్కు చెందిన రావు చినధన్రాజ్, కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సిలివేరు శ్రీకాంత్, సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన గౌతి మల్లేశ్, మల్కాజిగిరికి చెందిన లొగ్గరి రమేశ్, మునగాలకు చెందిన బండారు నాగరాజు స్వతంత్ర అభ్యర్థులుగా తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్కు అందజేశారు. ఈనెల 30వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనున్నది. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వంతంత్రులు కూడా భారీగానే రంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి జానారెడ్డిని ప్రకటించగా.. టీఆర్ఎస్, బీజేపీల నుంచి అభ్యర్థులపై నేడో రేపో స్పష్టత రానున్నది. వీరంతా ఈనెల 27తర్వాతే నామినేషన్లు వేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. అభ్యర్థి ఖరారు కాకపోయినప్పటికీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతుంది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో క్షేత్రస్థాయిలో ప్రతి ఓటర్ను కలిసే పనిలో నేతలు, కార్యకర్తలు నిమగ్నమయ్యారు.
చకచకా ఏర్పాట్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన జిల్లా అధికార యంత్రాంగం అదే స్ఫూర్తితో సాగర్ ఉప ఎన్నికను సజావుగా నిర్వహించేలా దృష్టి సారించింది. ఎక్కడా లోటుపాట్లు లేకుండా, విమర్శలకు తావివ్వకుండా నిబంధనల ప్రకారం ఎన్నికలను నిర్వహించేలా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఎన్నికల నిబంధనలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్పై రాజకీయ పార్టీల ప్రతినిధులతోపాటు సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఇందులో అన్ని విషయాల గురించి వివరిస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నామినేషన్ల సమయంలో నిర్వహించే ర్యాలీలు, సభలు, సమావేశాలకు సంబంధించిన అన్ని అనుమతులను ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థుల ఖర్చుపై నిఘా
నామినేషన్ల నాటి నుంచి పోలింగ్ వరకు నిర్వహించే ప్రచారానికి సంబంధించిన ఖర్చుపై ఎప్పటికప్పుడు నిఘా కొనసాగనుంది. పోటీ చేసే ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా రూ.30.80లక్షల వరకు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఈ ఖర్చు వివరాలను అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల వ్యయ నియంత్రణ అధికారిగా జిల్లా సహకార అధికారి వ్యవహరించనున్నారు. ఇక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు కోసం మోడల్ కోడ్ బృందాలు, ఫ్లయింగ్ స్కాడ్స్, వీడియోగ్రఫీ, స్టాటికల్ సర్వేలెన్స్ బృందాలు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయి. ఒక్కో అభ్యర్థి రోజుకు రూ.10వేల వరకు నగదు చెల్లింపుచేయడానికి అనుమతి ఉంది. ఇందుకోసం ప్రతి అభ్యర్థి ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ను తెరిచి అన్ని రకాల ఆర్థిక లావాదేవీలను దీని ద్వారానే నిర్వహించాల్సి ఉంటుంది. ఇక రాజకీయ ప్రకటనలకు, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ప్రచార ప్రకటనలకు ముందుగానే జిల్లా మీడియా సర్టిఫికెట్ అండ్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ)అనుమతులు తీసుకోవాల్సి ఉం టుంది. ఇక పెయిడ్ న్యూస్ పేరుతో ఇచ్చే అన్నిరకాల ప్రచారాలపై పకడ్బందీ నిఘా ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. మరోవైపు పోలింగ్ సిబ్బంది నియామకం, శిక్షణ, పోలింగ్ సామగ్రిని సిద్ధం చేయడంపై దృష్టి సారించారు. ఇప్పటికే 346 పోలింగ్ కేంద్రాలను గుర్తించగా అందులో 53 ఆగ్జలరీ స్టేషన్లు కూడా ఉన్నాయి. ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో అవసరమైన ఈవీఎంలను సిద్ధం చేసే పనిని ముమ్మరం చేశారు.