హైదరాబాద్, మార్చి 3(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకుగాను ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఐదు దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ను అమలుచేయనున్నట్టు చెప్పారు. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో కార్యక్రమ అమలుపై వారికి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. శాఖల వారీగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని, గ్రామసభల్లో పథకాల వారీగా ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. శాఖల వారీగా 10 థీమ్లతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, సంక్షేమం, పిల్లల భద్రత, డ్రగ్స్కు అడ్డుకట్ట, రైతు సంక్షేమం, విద్య, యువత, క్రీడలు, మహిళలు, పర్యావరణంపై కార్యక్రమాలను చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందులో భాగంగానే ఏప్రిల్ 2న గ్రామస్థాయిలో గ్రామసభలు నిర్వహించాలని, ఏప్రిల్ 16న మండల స్థాయిలో, మే 2న నియోజకవర్గ స్థాయిలో, మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమాల నిర్వహణ, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని సూచించారు. 99 రోజుల కార్యక్రమాల్లో వార్డు సభ్యులు, సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్లను భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వానికి కళ్లు, చెవులు కలెక్టర్లేనని, క్షేత్రస్థాయిలో సమర్థంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. నెలలో కనీసం 10 రోజులైనా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. కలెక్టర్లు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేయాలని సూచించారు. ‘రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కోసం ఒక్కో అధికారికి బాధ్యత ఇవ్వాలి. విద్యార్థులతోపాటు పాఠశాలలో భోజనం చేయాలి.
కలెక్టర్లు వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలి. ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’ అని ఆదేశించారు. వైద్యంపై ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తున్నదని, అన్ని మెడికల్ కాలేజీలతో ప్రభుత్వ దవాఖానలను ఇంటిగ్రేట్ చేయాలని భావిస్తున్నట్టు సీఎం తెలిపారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు.
ఔట్సోర్సింగ్ ఏజెన్సీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మిల్లర్ల దగ్గర నుంచి ధాన్యాన్ని వెనకి రాబట్టుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని, ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్పై కఠినంగా వ్యవహరించకపోతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్ల పనితీరుపై జూన్లో మరోసారి సమావేశం నిర్వహిస్తానని తెలిపారు.